రూ.110 కోట్లతో 15 చెక్ డ్యామ్ల నిర్మాణం.. అక్కడ రూ.ఫించన్ రూ.500.. మంత్రి హరీశ్ రావు ఫైర్
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారికి పదవులు వచ్చాయని ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. స్వ రాష్ట్రం అభివృద్ధి పుంతలు తొక్కుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో జరుగుతోన్న పనులను వివరించారు. ఆయన శుక్రవారం నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు.
గత ప్రభుత్వాల పాలనలో మంజీర నదిపై ఒక్క చెక్ డ్యామ్ నిర్మించలేదన్నారు. కానీ మాటలు కోటలు దాటుతాయని చెప్పారు. తమ ప్రభుత్వం 110 కోట్లతో 15 చెక్ డ్యామ్లు నిర్మించాయని తెలిపారు. అందులో 14 చెక్ డ్యామ్లు నర్సాపూర్ కు ఉపయోగపడతాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పింఛన్లు రూ. 400 నుంచి రూ. 500 ఇస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రూ. 2 వేల పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తోన్న మంచిని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు.
Recommended Video
పంటలకు కనీస మద్దతు ధర ఇస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. అందుకే జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మక్కలను ఇక్కడకు తీసుకొచ్చి అమ్ముతున్నారని తెలిపారు. దీంతో స్థానిక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఇవేవి విపక్షాలకు పట్టవని ఆయన ధ్వజమెత్తారు. స్వ రాష్ట్రం కోసం లాఠీ దెబ్బలు తిన్నవారికి పదవులు దక్కడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా 24 గంటల కరెంటు సరఫరా ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే ఏం రాదు, పాలించడం చేతకాదు అని రకరకాలుగా హేళన చేశారని గుర్తుచేశారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామని చెప్పారు.