దేశంపై పడతారట, కేసీఆర్ జాతీయ పార్టీపై షర్మిల, కేసీఆర్, కేటీఆర్కు సవాల్
సీఎం కేసీఆర్పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు గురించి స్పందించారు. ఉన్న దరిద్రం చాలదన్నట్టు ఇప్పుడు దేశంపై పడతారట అని సెటైర్లు వేశారు. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అంటూ ఎద్దేవా చేశారు.
ఇక్కడ రైతులు,నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోవడం తెలియదన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. గూట్లో రాయి తియ్యనోడు ఏట్లో రాయి తీస్తడట అని ఫైరయ్యారు. బంగారు తెలంగాణ అయ్యిందా..? ఎవరికి అయ్యింది బంగారం అని అడిగారు. కేసీఅర్ కుటుంబం.. కొడుకులకు, అల్లుళ్లకు బంగారం అయ్యిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
8 ఏళ్లలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటుందని గుర్తుచేశారు. రైతులకు భరోసా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాన్నైనా ఆదుకున్నరా అని అడిగారు. ఇవాళ షర్మిల పాదయాత్ర 2400 కిలోమీటర్ల మైలు రాయి దాటింది.
కేసీఆర్ ..కెటిఆర్కి సవాల్ విసిరారు. మీ పాలన మీరు అద్బుతం అని అంటున్నారు.. అలా అయితే నాతో ఒక్క రోజు పాదయాత్రకి రావాలని కోరారు. సమస్యలు ఉన్నాయని చూపిస్తానని తెలిపారు. సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లి పోతా.. సమస్యలు ఉంటే..మీ ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. దమ్ము ఉంటే సవాల్ స్వీకరించాలని కోరారు.