MI vs CSK match 1:దుమ్ము దులిపేయండి.. రైనా ఎమోషనల్ కామెంట్స్
క్యాష్ రిచ్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఎప్పటిలా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. కరోనావైరస్తో టోర్నమెంట్ వాయిదా పడినప్పటికీ అభిమానులకు మాత్రం ఈ ధనాధన్ క్రికెట్ ద్వారా మజా పంచాలని భావించి పక్కా ప్రణాళికను అమలు చేశారు నిర్వాహకులు. దుబాయ్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరుగుతోంది.
మెగా టోర్నీ ఐపీఎల్ ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్లో టాస్ పడటంతో మెగా ఈవెంట్ అధికారికంగా ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ జరిగే క్రమంలో పిచ్ పై తేమ చేరుకునే అవకాశం ఉందని చెప్పిన ధోనీ.. అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మరో కారణం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చెన్నై జట్టులో సీనియర్ ఆటగాళ్లు అయిన సురేష్ రైనా లేకపోవడం, బౌలింగ్ విభాగంలో తురుపు ముక్కగా ఉన్న హర్భజన్ కూడా లేకపోవడంతో ధోనీ ప్రత్యర్థులను ముందుగా బ్యాటింగ్కు దింపి ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాన్ని అమలు చేయాలని భావించి ఉంటాడని చెబుతున్నారు. చెన్నై జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు లుంగీని తీసుకోవడం జరిగింది.
ఇక టాస్ తాను గెలిచి ఉంటే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని ఉండేవాడినని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ధోనీ చెప్పిన కారణమే రోహిత్ కూడా చెప్పాడు. ఇక ఐపీఎల్ టోర్నీకి వ్యక్తిగత కారణాలతో దూరమైన రైనా... తొలి మ్యాచ్ ఆడుతున్న తన జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్కు దూరంగా ఉన్నప్పటికీ తన మనసంతా చెన్నై జట్టు చుట్టే ఉంటుందన్న విషయం మరవరాదని రైనా చెప్పాడు. విజిల్ పోడు అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియా వేదికగా రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విషెస్ అందించాడు.
ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ జట్టు మాజీ ఆటగాడు గిబ్స్ కూడా ఆ జట్టుకు విషెస్ తెలిపాడు. ఈ సీజన్లో తొలి గేమ్ ఆడుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు విషెస్ చెప్పాడు. ప్రత్యర్థులను దడదడ లాడించాల్సిందే అంటూ ముంబై ఇండియన్స్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ పై వీడియో సందేశాన్ని పంపాడు. తొలి మ్యాచ్ గట్టి ప్రత్యర్థులతో ఆడబోతున్నామని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ చెప్పాడు. చెన్నై జట్టు బలమైన ప్రత్యర్థిగా ఆయన అభివర్ణించాడు. అయినా సరే తమ ఆటగాళ్లు పూర్తి సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారని చెప్పాడు.