ముంబై వర్సెస్ ఢిల్లీ: రోహిత్ ఎంట్రీ ఇస్తాడా? పొలార్డ్పై శ్రేయాస్ అయ్యర్ పైచేయి సాధిస్తాడా?
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020లో శనివారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ప్లేఆఫ్ ఖరారు చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టుతో ప్లేఆఫ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. రెండు జట్ల కూడా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దాదాపు సమానంగానే ఉన్నాయి.
శనివారం ముంబైతో జరిగే మ్యాచులో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అలాగే ముంబై కూడా తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. లేదంటే ఇతర జట్లతో గట్టి పోటీ ఎదుర్కొవాల్సి ఉంటుంది.
ఎడమ కాలి గాయంతో గత మూడు మ్యాచులకు దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. శనివారం జరిగే మ్యాచ్లో పాల్గొనే అవకాశం లేకపోలేదు. అయితే, దీనిపై ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. పాయింట్ల జట్టులో ముంబై జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా, మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది.
ముంబై జట్టు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ లాంటి బ్యాట్స్మెన్లతో బలంగానే ఉంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడకపోతే పొలార్డ్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టులో కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగానే ఉంది. శిఖర్ ధావన్ రాణిస్తున్నప్పటికీ.. అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శిమ్రోన్ హెట్మేర్, మార్కస్ స్టోనీస్ లాంటి ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది.