MI vs DC : నేడే ఐపీఎల్ ఫైనల్.. కప్పు మళ్లీ ముంబైదేనా.. లేక ఢిల్లీ ఎగరేసుకుపోతుందా..?
ఎప్పటిలాగే తాజా సీజన్లోనూ అభిమానులను ఆసాంతం అలరిస్తూ సాగిన ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది అసలు ఐపీఎల్ ఉంటుందా... ఉండదా అన్న సందేహాల నడుమ... ఎట్టకేలకు 5 నెలల విరామం తర్వాత టోర్నీ మొదలైంది. ఆలస్యం జరిగినా... ఫన్&ఎంటర్టైన్మెంట్కు ఏమాత్రం ఢోకా లేకుండా టోర్నీ సాగింది. థ్రిల్లింగ్ విక్టరీలు,అనూహ్య ఓటములు.. మొత్తంగా అంచనాలకు అందని రీతిలో సాగిన ఐపీఎల్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది.
తుది పోరులో నేడు(నవంబర్ 10) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పును అందుకోలేకపోయిన ఆ జట్టు... ఈసారైనా ఆ కలను నెరవేర్చుకోవాలనుకుంటోంది. ఈ సీజన్లో మొదటి క్వాలిఫయర్లో ముంబై చేతిలో ఓటమిపాలైన ఢిల్లీ... క్వాలిఫయర్-2లో సన్ రైజర్స్పై అద్భుత విజయం సాధించి ఫైనల్లోకి దూసుకొచ్చింది.
ఇక ముంబై ఇండియన్స్ జట్టు విషయానికొస్తే... ఐపీఎల్లో అత్యధికంగా 5 సార్లు ట్రోఫీని ఎగరేసుకుపోయిన ఏకైక జట్టు ఇది మాత్రమే. ప్రస్తుత ఐపీఎల్ టోర్నీలో మిగతా అన్ని జట్ల కంటే ముంబై అన్ని విధాలుగా మెరుగ్గా ఉంది. టాపార్డర్లో రోహిత్ శర్మ,డికాక్,సూర్య కుమార్ యాదవ్.. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్,కృనాల్ పాండ్యా,హార్థిక్ పాండ్యాలతో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్తో ఉంది. ఇక బౌలింగ్ పరంగా బుమ్రా విజృంభిస్తూనే ఉన్నాడు. ఫైనల్లోనూ సమిష్టిగా రాణించి ఆరోసారి కప్ ఎగిరేసుకుపోవాలని ముంబై ఇండియన్స్ జట్టు భావిస్తోంది. మరి ముంబై దూకుడుకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేస్తుందా... లేక ఈసారి కూడా కప్పును అందుకోకుండానే టోర్నీని ముగిస్తుందా అన్నది నేడు తేలిపోనుంది.