జగన్ రెడ్డి గారూ! రైతులకు అన్యాయం చేయొద్దు: ఇదీ లెక్క.. చర్యలు తీసుకోండి: నాగబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిందని ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఉండొచ్చని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి.
రైతులంతా రోడ్లపైకి..
ఈ నేపథ్యంలో నాగబాబు రైతుల వద్దకు వెళ్లి వారి నిరసనలకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘అంతా నా ఇష్టం' యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి జనసేన పొలిటికల్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సారథ్యంలో వెళ్లామని తెలిపారు. అక్కడి రైతుల మనోగతాన్ని తెలుసుకున్నామని నాగబాబు వివిరంచారు. రాష్ట్ర రాజధాని కోసమే తమ భూములు ఇస్తే ఇప్పుడు రాజధాని మారుస్తామంటూ తమకు అన్యాయం చేస్తారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులు ఒకే కులం వారు కాదని, అన్ని కులాల వారు ఉన్నారని.. వారంతా ఇప్పుడు రోడ్డుపైకి వచ్చారని రైతులు తెలిపారని చెప్పారు.
ఇదీ లెక్కంటూ నాగబాబు..
అమరావతి రాజధానికి రైతులిచ్చిన భూముల వివరాలు ఇలా ఉన్నాయని నాగబాబు వెల్లడించారు. ఒక ఎకరం లోపు భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 40,490, మొత్తం 10,034 విస్తీర్ణం ఎకరాలు. ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 5,227. మొత్తం విస్తీర్ణం 7,465 ఎకరాలు. రెండు నుంచి ఐదు ఎకరాలలోపు భూమి ఇచ్చిన రైతుల సంఖ్య 3,337. మొత్తం విస్తీర్ణం 10,103 ఎకరాలు. ఐదు నుంచి 10 ఎకరాల్లోపు భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 668. వీళ్లిచ్చిన మొత్తం విస్తీర్ణం 4,420 ఎకరాలు. 10 నుంచి 20 ఎకరాల్లోపు భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 142, మొత్తం విస్తీర్ణం 1,877 ఎకరాలు. 20 నుంచి 25 ఎకరాలలోపు భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 12, మొత్తం విస్తీర్ణం 269 ఎకరాలు. 25 ఎకరాలకు పైగా భూమలు ఇచ్చిన రైతుల సంఖ్య 5, మొత్తం విస్తీర్ణం 151 ఎకరాలు.. అని తెలిపారు.
గతంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోండి..
‘టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సేకరించిన మొత్తం 34,322 ఎకరాలు, ఇచ్చిన మొత్తం రైతుల సంఖ్య 29,881. ఇందులో 5వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని, ల్యాండ్ పూలింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అది వాస్తవంగా జరిగి ఉండొచ్చు' అని నాగబాబు అన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నేతలు చేసిన తప్పునకు దాదాపు 28వేల మంది రైతులు నష్టపోవడం సరికాదని అన్నారు.
రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా అంగీకరించారని, అందుకే తాము భూములు ఇచ్చామని రైతులు చెబుతున్నారని తెలిపారు. ఇప్పుడేమో భూములు తిరిగి ఇస్తామంటే తాము ఏం చేసుకోవాలని అంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జగన్ సర్కారును కోరారు. అయితే, రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దని నాగబాబు అన్నారు.