హుజుర్నగర్ బరి.. ఫైనల్గా పోటీలో వీళ్లే.. ఇక ఆ లెక్క తేలాలిగా..!
నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నాటి పరిస్థితి తలపించింది. అయితే నామినేషన్ల ఉప సంహరణ తర్వాత హుజుర్నగర్ బరిలో 28 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వందకు పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. చివరకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగియడంతో పోటీలో నిలిచే అభ్యర్థుల సంఖ్య ఫైనల్ అయింది.
76 నామినేషన్లు.. చివరకు మిగిలింది ఎంతంటే..!
హుజుర్నగర్ ఉప ఎన్నిక కోసం మొత్తం 76 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే స్క్రూటినీలో భాగంగా రిటర్నింగ్ కార్యాలయం అధికారులు 45 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. ఇక మిగిలింది 31. అయితే అందులో నామినేషన్ల ఉప సంహరణ గడువు (గురువారం - 03.10.2019) ముగిసే నాటికి ముగ్గురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వారు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో ఇక బరిలో 28 మంది అభ్యర్థులు నిలిచినట్లైంది.
తెలంగాణ కొత్త లిక్కర్ పాలసీ.. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు డబుల్
నామినేషన్ల ఉప సంహరణ తర్వాత.. మిగిలింది వీళ్లే
హుజుర్నగర్ ఉప ఎన్నికలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. ఇక ఎన్నికలు జరగడం.. ఫలితాలు రావడమే తరువాయి. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన శంకర్, ప్రతాప్ రెడ్డి, సైదులు అనే ముగ్గురు వ్యక్తులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఇక పోటీకి 28 మంది మిగిలినట్లైంది. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఇంతమంది బరిలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాన పార్టీల నుంచి వీళ్లే పోటీలో..!
ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పోటీలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి రామారావు, టీడీపీ నుంచి కిరణ్మయి బరిలో నిలిచారు. సీపీఎం అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ కావడంతో ఆ పార్టీ అభ్యర్థి శేఖర్ రావు పోటీలో లేరు. అదలావుంటే అధికారపక్షంపై నిరసన గళం వినిపిస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనకు కొన్ని వర్గాలు, కొందరు నేతలు మద్దతు ఇస్తుండటంతో బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా పోటీలో నిలబడినట్లైంది.
ఖాకీల ప్రవర్తన సరిగా లేదు.. జైళ్లల్లో పేదలే.. పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ హాట్ కామెంట్స్..!
పొత్తుల లెక్కలు.. నామినేషన్ల ఈక్వేషన్స్.. చిరవకు తేలాల్సింది అదేగా..!
అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జన సమితి సపోర్టు ఇస్తోంది. సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆ పార్టీ మద్దతును టీడీపీ కోరుతోంది. ఈ నెల 21వ తేదీన హుజుర్నగర్ బై పోల్స్ జరగనున్నాయి. 24వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో నామినేషన్ల లెక్క తేలిపోయింది.. ఇక ఓట్ల లెక్క తేలాల్సి ఉందనే టాక్ వినిపిస్తోంది.