రక్తమోడిన సాగర్ హైవే: అయిదుమంది దుర్మరణం: అదుపు తప్పి.. బోల్తా కొట్టిన కారు
నల్లగొండ: తెలంగాణలో మరోసారి రహదారులు రక్తసిక్తం అయ్యాయి. మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రోజుల కిందటే వరంగల్ రూరల్ జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. తాజాగా మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘటనలో మరో అయిదుమంది మృతి చెందారు. నిద్రమత్తు, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం ధైర్యపురం తండా వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వైపు వెళ్తోన్న కారు సాగర్ జాతీయ రహదారిపై ధైర్యపురి తండా-వింజమూరు వద్ద అదుపు తప్పింది. ప్రమాదానికి గురైంది. బోల్తా కొట్టింది. హైదరాబాద్కు కృష్ణా జలాలను తరలించడానికి ఉద్దేశించిన పైప్లైన్ ఎయిర్ వాల్వ్ వాల్ను ఢీ కొట్టింది. తుక్కుతుక్కు అయింది. దీనితో కారులో ప్రయాణిస్తోన్న నలుగురు సంఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించారు.
Recommended Video
ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుగా మారడంతో అందులో నుంచి మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు, స్థానికులు శ్రమించాల్సి వచ్చింది. అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చని పోలసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతులందరూ యువకులేనని, వారి గురించి తెలుసుకుంటున్నామని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.