లక్షన్నర మందితో సభ.. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరికకు భారీగా ఏర్పాట్లు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8వ తేదీన నల్గొండలో ఎన్ జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో పార్టీలో చేరతారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త రాంజీ గౌతం సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకంటారు. కార్యక్రమంలో గురుకులాల మాజీ విద్యార్థులు, మద్దతుదారులు, అభిమానులు హాజరవుతారు.
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాయకత్వంలో పనిచేయాలని బహుజన సమాజ్ పార్టీ, స్వేరోస్ సభ్యులు గత రెండురోజులగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నారు. బీఎస్పీ ద్వారా నల్లగొండ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని ప్రవీణ్కుమార్ నిర్ణయించుకున్న నేపథ్యంలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లా బీఎస్పీ, స్వేరోస్ నేతలు నిమగ్నం అయ్యారు. ఇప్పటికే 12 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు.
నల్లగొండ సభకు హాజరు కావాలని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. వాహనాలను సొంతంగా సమకూర్చుకోవాలని, భోజనం ఖర్చు కూడా భరిస్తూ స్వచ్ఛందంగా రావాలని సూచిస్తున్నారు. ముందుగా స్థానిక బీఎస్పీ, స్వేరోస్ నేతల సమాచారం తీసుకుని వారి సహకారంతో సర్పంచ్ ఇతర ప్రజాప్రతినిధులు, యువకులను కలుస్తున్నారు. తమ బాధ్యులు లేని చోట రాజకీయాలు, సేవ పట్ల ఆసక్తి ఉన్న యువత, పెద్దలను కలిసి ప్రచారం చేస్తున్నారు. బహుజనవాదం గురించి వివరిస్తూ.. మన బాగుకోసం ప్రవీణ్ కుమార్ వస్తున్నారని, ఆయనను బలపర్చాలని కోరుతున్నారు.
Recommended Video
అంతకుముందు తాను హుజూరాబాద్లో కొందరికి మద్దతు ఇస్తున్నానని దుష్ప్రచారం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తనపై వస్తోన్న ప్రచారాన్ని విశ్వసించొద్దని కోరారు. అంబేద్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. తనపై కేసులు పెట్టారని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. బహుజన, బడుగు వర్గాల బాగు కోసమే తాను పనిచేస్తానని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని వివరించారు. ఇక లక్షన్నర మందితో సభను పెడుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా కరోనా ఉన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.