భిక్షను పక్కనపెట్టి యువకుడి ప్రాణాలు కాపాడిన అయ్యప్ప భక్తులు, మహిళ గల్లంతు
నల్గొండ: అయ్యప్ప మాలధారణ వేసిన వారు ఎంత నిష్టతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేకువజాము నాలుగు గంటలకు లేచి చన్నీళ్లతో స్నానం, పూజ, ఒకరోజుకు ఒకేసారి భోజనం, పాదరక్షలు ధరించకుండా ఉండటం.. ఇలా మాలలో ఉన్న 45 రోజులు ఎంతో నిష్టగా ఉంటారు. అయ్యప్పమాలధారులను చూస్తే పక్కవారికి ఈ రోజులు చాలా కఠినంగా కనిపించవచ్చు.
కానీ మాలవేసిన వారు మాత్రం దానిని ఆస్వాదిస్తారు. మాలధారణ వేసిన వారు రోజుకు ఒకేసారి భిక్ష (భోజనం) చేయాలి. భిక్ష మీద నుంచి ఒక్కసారి లేచారంటే మళ్లీ తినవద్దు. ఉదాహరణకు ఎవరైనా అత్యవసరంగా పని ఉండి ఒకటి రెండు ముద్దలు పెట్టుకొని లేచినా మళ్లీ ఆ రోజు తినకూడదు. విషయానికి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయ్యప్పమాలధారణ ధరించిన వారు మానవత్వం చూపించారు.
ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో కొట్టుకుపోయిన కారు
ప్రమాదవశాత్తూ సాగర్ ఎడమ కాల్వలో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం నుంచి ఓ యువకుడిని అయ్యప్ప మాలధారణ ధరించిన స్వాములు కాపాడారు. కారులో అతని తల్లి ఉంది. ఆమె మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమె కోసం ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన గురువారం నాడు జరిగింది.
డాక్టర్ వద్దకు వెళ్లారు
వనస్థలిపురానికి చెందిన ఆంజనేయులు, అనిత దంపతులు తమ కొడుకు నవీన్తో కలిసి అద్దె డ్రైవర్ను తీసుకొని తమ కారులో మునగాలలోని ఓ డాక్టర్ వద్దకు వచ్చారు. కారు డ్రైవర్ శ్రీకాంత్ స్వామి మాల ధరించారు. డాక్టర్కు చూపించుకున్న తర్వాత డ్రైవర్ భిక్ష కోసం సాగర్ ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు.
నవీన్ కారు తాళాలు అడిగి తీసుకొని స్టార్ట్ చేయడంతో అదుపుతప్పింది
డ్రైవర్ శ్రీకాంత్, ఆంజనేయులు భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో తల్లి అనిత, కొడుకు నవీన్లు కాలువ పక్కన ఉన్న కారులో కూర్చున్నారు. కారు లైట్ వెలుగుతుండటంతో నవీన్.. డ్రైవర్ వద్ద నుంచి కారు తాళాలు అడిగి తీసుకున్నారు. తాళాలు తెచ్చిన నవీన్ కారును స్టార్ట్ చేశారు. కారు వెంటనే అదుపుతప్పి కాల్వలోకి దూసుసెళ్లింది.
భిక్షను మధ్యలో ఆపేసి
ఆ సమయంలో స్వాములు (అయ్యప్పమాలవేసిన వారు) తాము చేస్తున్న భిక్షను మధ్యలో ఆపి కాల్వలోకి దూకి నవీన్ ప్రాణాలను కాపాడారు. మొదట నవీన్ను కాపాడారు. ఆ తర్వాత కారులోనే ఉండి నీటిలో కొట్టుకుపోతున్న అనితను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ కారులో కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.