గుప్తనిధుల పేరిట 10 లక్షలు మాయం.. రాగి, ఇత్తడి నాణాలతో మోసం
సూర్యాపేట : చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న చందంగా తయారవుతోంది పరిస్థితి. మీ ఇంట్లో బంగారం నిధులు ఉన్నాయంటే చాలు.. ఏమి ఆలోచించలేకపోతున్నారు జనాలు. రాత్రికి రాత్రి కోటీశ్వరులమైపోతామనే భావనతో దొంగ బాబాలు, మోసగాళ్లు చెప్పే మాటలు విని ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు ఉన్నదంతా పొగొట్టుకుని లబోదిబమంటున్న సంఘటనలు కొకొల్లలు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన మోసగాళ్ల మాయకు పరాకాష్టగా మారింది.
10 లక్షలకు ఎసరు
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం అమరవరంలో గుప్తనిధుల పేరిట దొంగబాబా బురిడీ కొట్టించాడు. మీ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని.. వాటిని బయటకు తీయాలంటే పూజలు గట్రా చేయాలని ఓ కుటుంబాన్ని నమ్మించాడు. అయితే సదరు దొంగబాబా మాటలతో దాదాపు 10 లక్షల రూపాయల వరకు ముట్టజెప్పారు.
తవ్వకాల్లో నాణాలు..!
పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నాక.. ఏదో ఒకటి చేయాలిగా అనుకుని కొత్త నాటకానికి తెరతీశాడు దొంగబాబా. పూజలు, బలి అంటూ ఆ కుటుంబాన్ని సన్నద్ధం చేశాడు. ఇక సోమవారం అర్ధరాత్రి మేకను బలి ఇచ్చి తవ్వకాలు జరిపించాడు. అయితే విచిత్రంగా కొన్ని కిలోల మేర నాణాలు బయటపడ్డాయి.
రాగి, ఇత్తడి మిశ్రమం..! దొంగబాబాపై కేసు
సదరు దొంగబాబా తెలివిగా ప్రవర్తించాడు. అతడిని పూర్తిగా నమ్మిన కుటుంబాన్ని బురిడీ కొట్టించాలనుకున్నాడు. దాదాపు 10 లక్షల రూపాయలు తీసుకుని.. తవ్వకాల్లో ఏదో ఒకటి దొరికేలా చేయకుంటే తనను నిలదీస్తారని భావించాడు. దాంతో తానే 20 కిలోల రాగి, ఇత్తడి మిశ్రమరూపంలో ఉన్న 20 కిలోల నాణాలు తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఇంటిలో పూజలు చేయాలని వస్తూ.. తన వెంట తెచ్చుకున్న ఈ నాణాలను తవ్వకాల్లో బయటపడ్డట్లు నమ్మించాడు.
గుప్తనిధుల్లో నాణాలు బయటపడ్డా.. అవి బంగారం కాకపోవడంతో ఆ ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. అయితే సదరు దొంగబాబా తమను మోసం చేశాడనే విషయం అర్థమైంది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆ 20 కిలోల నాణాలను స్వాధీనం చేసుకుని.. దొంగబాబాపై కేసు పెట్టినట్లుగా సమాచారం.