సూర్యాపేటలో అలజడి.. బాంబు పేలిందంటూ.. చివరకు..!
సూర్యాపేట : జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. బాంబు పేలిందంటూ ప్రచారం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇనుప సామాను సేకరించే షాపులో పేలుడు సంభవించడంతో స్పాట్లో ఒకరు చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు దుకాణం సూర్యాపేట నేషనల్ హైవేకు ఆనుకుని ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. శుక్రవారం నాడు ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.
ఖమ్మం జిల్లా వాసి నాగరాజ్ సూర్యాపేటలో కొద్దికాలంగా పాత ఇనుప సామాను దుకాణం నిర్వహిస్తున్నారు. అతడి దగ్గర దాదాపు పది మందికి పైగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వర్కర్స్గా పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పాత వస్తువులను, పాడుబడ్డ వాటిని కిలోల చొప్పున సేకరించి ఇక్కడి దుకాణంలో రీ సైక్లింగ్ చేస్తుంటారు. అనంతరం వాటిని హైదరాబాద్కు పంపించి అమ్మేస్తుంటారు.
8 మంది టీఆర్ఎస్ నేతలు జంపా.. అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా.. అందులో నిజమెంత?
ఆ క్రమంలో శుక్రవారం ఉదయం కూడా ఎప్పటిలాగే రీ సైక్లింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో పనిలో నిమగ్నమైన మధ్య ప్రదేశ్ వాసి రామచంద్ర స్పాట్లో చనిపోయాడు. యూపీకి చెందిన సల్మాన్ ఖాన్ తో పాటు.. జిల్లాలోని చివ్వెంల మండలానికి చెందిన చిలకమ్మ, బుజ్జమ్మ అనే మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
పాత ఇనుప సామాను దుకాణంలో నుంచి భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాంబు పేలిందని వదంతులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే అది బాంబు కాదని.. పాత వస్తువులను నిర్వీర్యం చేసే క్రమంలో పేలుడు సంభవించిదని భావిస్తున్నారు పోలీసులు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.