హుజుర్నగర్కు సీఎం కేసీఆర్.. ప్రజా కృతజ్ఞత సభ.. వరాల మూట ఇచ్చేనా?
సూర్యాపేట : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 88 స్థానాల్లో రెపరెపలాడిన గులాబీ జెండా.. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేలకు పైగా ఓట్లతో బంపర్ మెజార్టీ సాధించడం పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపింది. ఆ మేరకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం (24.10.2019) నాడు హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హుజుర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ క్రమంలో శనివారం (25.10.2019) నాడు హుజుర్నగర్లో సభ ఉంటుందని ప్రకటించారు. ఆ మేరకు ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు.
హుజుర్నగర్ ఫలితం.. టీఆర్ఎస్ పార్టీకి మరింత జోష్..!
హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక విజయం టీఆర్ఎస్ పార్టీకి మరింత జోష్ తెచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలు ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారుతాయని చాలామంది భావించారు. ఆ లెక్కన కారు గట్టెక్కడం కష్టంగా మారుతుందేమోననే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఎన్నికల ఫలితాలు అలాంటి ఊహాగానాలకు చెక్ పెట్టాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి మీద 43 వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం.
అంతా విషాదమే.. 6 పాయింట్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొండా ట్వీట్ల యుద్దం..!
హుజుర్నగర్లో ప్రజా కృతజ్ఞత సభ.. సీఎం కేసీఆర్ రాక
ఎన్నికల వేళ హుజుర్నగర్లో సీఎం కేసీఆర్ సభ ప్లాన్ చేశారు గులాబీ నేతలు. అయితే చివరి క్షణంలో వర్షం కారణంగా ఆయన సభ రద్దయింది. ఏవియేషన్ అధికారుల సూచనతో హుజుర్నగర్ పర్యటన రద్దు చేసుకున్నారు. కేసీఆర్ రాకపోవడంతో అది కాస్తా కారు జోరుకు బ్రేకులు వేస్తుందేమోనని ప్రతిపక్ష నేతలు భావించారు. కానీ వారి ఊహాలకు కూడా అందకుండా టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ నేపథ్యంలో గురువారం నాడు హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కేసీఆర్. పని చేయడమే తప్ప మరొకటి తెలియని తమ ప్రభుత్వానికి ఈ విజయం టానిక్లా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో హుజుర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపి.. శనివారం నాడు సభ ఏర్పాటు చేసి సెగ్మెంట్ అభివృద్ధి డిక్లరేషన్ ప్రకటిస్తానని వెల్లడించారు.
సభ ఏర్పాట్లు పరిశీలించిన టీఆర్ఎస్ నేతలు
శనివారం నాడు హుజుర్నగర్లో తలపెట్టిన ప్రజా కృతజ్ఞత సభకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో.. మంత్రి జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, ఎస్పీ భాస్కరన్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన హుజుర్నగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు నియోజకవర్గ అభివృద్దికి కేసీఆర్ వరాలు ప్రకటిస్తారని తెలిపారు.
ప్రభుత్వం ఇంకా పట్టుదలతో పనిచేస్తుంది : మంత్రి జగదీశ్ రెడ్డి
హుజూర్నగర్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు వల్ల మరింత ఆత్మ విశ్వాసం పెరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా పట్టుదలతో పనిచేస్తుందన్నారు మంత్రి. హుజుర్నగర్ అభివృద్ధి కోసం చేపట్టబోయే పనులను స్వయంగా కేసీఆర్ ప్రకటించనున్నట్లు చెప్పారు. లక్ష మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని.. రోడ్డు మార్గంలో కేసీఆర్ హుజుర్నగర్కు చేరుకుంటారని తెలిపారు. సభ నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని.. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ విజయం టానిక్.. బాధ్యత పెరిగింది.. హుజుర్నగర్ ప్రజలను కలుస్తా : సీఎం కేసీఆర్
హుజుర్నగర్ ప్రజలకు కేసీఆర్ వరాలు : పల్లా
ప్రతిపక్ష నేతలకు దిమ్మ తిరిగేలా టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి ఘన విజయం కట్టబెట్టిన హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కేసీఆర్ సభ రద్దయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో తమ పార్టీ అభ్యర్థిని అత్యంత మెజార్టీతో గెలిపించడం ఆనందంగా ఉందన్నారు. అదే క్రమంలో ఇక్కడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్ హుజుర్నగర్కు వరాల జల్లు కురిపించనున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ రాక కోసం ప్రజలు స్వచ్ఛందంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.