అదీ అబద్దపు ప్రచారమే, కేసీఆర్పై ఈటల రాజేందర్ నిప్పులు
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. అలాగే విమర్శల పర్వం కూడా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇటీవల బీజేపీ గురించి, వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఇవాళ అదే విషయంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. కేసీఆర్ చెబుతుంది అబద్దం అని పేర్కొన్నారు.
బీజేపీ గెలిపిస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని సీఎం కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. తప్పుడు మాటలను నమ్మొద్దని ప్రజలను కోరారు. హుజూరాబాద్లో తాను గెలిచి ఏడాదైనా ఇప్పటికీ మీటర్లు పెట్టలేదని తెలిపారు.కేసీఆర్, బంగారు తెలంగాణ పేరుతో ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని ఫైరయ్యారు.
రాజెక్టుల పేరుతో ఖర్చు చేసే కోట్లాది రూపాయల ప్రజాధనం కమీషన్ రూపంలో వెళ్తోందని ఆరోపించారు. సంక్షేమ పథకాలు, గ్రామాల్లో అభివృద్ధి పథకాలకే కాదు, ఉద్యోగుల జీతాలకు కొరత నెలకొన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తిరిగేందుకు విమానం కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన విమానం కొనుగోలుకు విరాళాలు వచ్చాయనడం అబద్దం అని తెలిపారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్ మార్పు కోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశాడని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. దానికి ప్రజలు మద్దతు తెలుపాలని కోరారు. కేసీఆర్ చెబుతున్న అబద్దపు మాటలను నమ్మొద్దని విన్నవించారు.