అమ్మోరి ఆలయంలో నాగుపాము.. ప్రత్యేక పూజలు.. ఎగబడ్డ జనం..!
నల్గొండ : జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం వింత చోటు చేసుకుంది. శ్రావణ మాసం చివరి మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు. అదే సమయంలో అమ్మోరి విగ్రహం దగ్గర నాగుపాము కనిపించడంతో భక్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తమకు కొంగు బంగారమై నిలుస్తున్న అమ్మోరు ప్రత్యక్షంగా నాగదేవత రూపంలో తరలివచ్చి తమను కరుణించిందని సంబరపడ్డారు.
శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే క్రమంలో చివరి మంగళవారం నాడు కూడా స్పెషల్ పూజలు చేపట్టారు. దాంతో భక్తులు కూడా భారీగానే తరలివచ్చారు. అయితే ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు, అర్చకులు ఫణి ఆచార్య పూజలు జరుపుతుండగా ఆకస్మాత్తుగా నాగుపాము ప్రత్యక్షమైంది. దాంతో భక్తులు అమ్మోరు ఈ రూపంలో వచ్చారని హర్షం వ్యక్తం చేశారు.
వామ్మో కేటుగాళ్లు.. బ్యాంకులే టార్గెట్.. ఎలా కొల్లగొడుతున్నారంటే..!
అమ్మోరి విగ్రహం దగ్గరగా వచ్చిన నాగుపామును అర్చకులు ఫణి ఆచార్య తన చేతుల్లోకి తీసుకుని హారతి ఇచ్చారు. దాదాపు 5 అడుగుల పొడవున్న నాగుపామును చూసి భక్తులు అలాగే చూస్తూ ఉండిపోయారు. అమ్మోరి దర్శనం కోసం వస్తే నాగదేవత ఇలా కనిపించడం తమకు ఆనందంగా ఉందని చెప్పారు. ఇదంతా కూడా దైవ మహిమగా అభివర్ణించారు. శ్రావణమాసం మొదలు నెలరోజులుగా ఎన్నడూ కనిపించని నాగుపాము చివరి మంగళవారం కనిపించడం మహిమే అంటున్నారు.
ఇదివరకు కూడా ఇక్కడి దేవాలయం ప్రాంగణంలో ఉన్న వేపచెట్టుపై నాగుపాము ప్రత్యక్షమైన సందర్భాలున్నాయి. అయితే ఆ నోట ఈ నోట అమ్మోరి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైందనే వార్త దావానంలా వ్యాపించడంతో చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అమ్మోరితో పాటు నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. చివరకు ఆలయ అర్చకులు ఆ పామును నెమ్మదిగా కింద వదిలిపెట్టడంతో పక్కనే ఉన్న పుట్టలోకి వెళ్లినట్లు చెబుతున్నారు.