హుజుర్నగర్లో కారుకు బ్రేకులే.. ప్రభుత్వం గూబ గుయ్యి మనాలే.. కాంగ్రెస్ నేతల మూకుమ్మడి దాడి
నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం కేసీఆర్ నియంత పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని.. ఆ క్రమంలో కారు జోరుకు బ్రేకులు పడతాయని జోస్యం చెబుతున్నారు. హుజుర్నగర్ బై పోల్స్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పలువురు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ పార్టీపై మాటల యుద్దం ప్రకటించారు.
అధికార పార్టీ ప్రలోభాలను ప్రజలు తిప్పి కొడతారు : భట్టి
హుజుర్నగర్లో అధికార పార్టీ ప్రలోభాలను ప్రజలు తిప్పి కొడతారని వ్యాఖ్యానించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇక్కడ ప్రజలు ఇచ్చే తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలకబోతుందని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఓటర్లు సిద్ధమయ్యారని.. ఆ క్రమంలో టీఆర్ఎస్కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. హుజుర్నగర్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని.. టీఆర్ఎస్ కుట్రలు ఇక సాగవని తేల్చి చెప్పారు.
టీడీపీ రెండో ఇన్నింగ్స్కు ఆదిలోనే దెబ్బ.. కీలక నేత గుడ్బై.. తెలంగాణలో పునర్ వైభవం సంగతేంటో?
టీఆర్ఎస్కు ఓటమి తప్పదన్న పొన్నం
హుజుర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కారు జోరుకు కళ్లెం పడటం ఖాయమన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే గనక సీఎం కేసీఆర్ బానిసల్లో మరో ఎమ్మెల్యే చేరతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని.. అదే టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. సీపీఐ మద్దతు కోరిన టీఆర్ఎస్.. ఇప్పటికే నైతికంగా ఓడిపోయిందన్నారు.
సీతక్క, కొండా సురేఖ ఓ రేంజ్లో ఫైరయ్యారుగా..!
ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క టీఆర్ఎస్ విధానాలపై విరుచుకుపడ్డారు. దొరల గడీలు బద్దలు కొట్టాలంటే హుజుర్నగర్ బై పోల్స్లో టీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే దండగ అని.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే హుజుర్నగర్ అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. అదలావుంటే మాజీ మంత్రి కొండా సురేఖ కూడా టీఆర్ఎస్ పార్టీని ఏకి పారేశారు. ప్రభుత్వం గూబ గుయ్యి మనేలా హుజుర్నగర్ ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. నల్గొండలో కాంగ్రెస్ నేతలంతా ఒకే తాటిపైకి వచ్చారని.. టీఆర్ఎస్ను ఓడించడం ఖాయమని స్పష్టం చేశారు.
అధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు ఇవ్వొద్దన్న ఉత్తమ్
హుజుర్నగర్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నేతలను ప్రలోభ పెడుతున్నారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తగిన ఆధారాలతో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పరాభవం తప్పదని.. కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేని అధికార పక్షానికి సీపీఐ మద్దతు ఇవ్వొద్దని కోరారు. సీఎం కేసీఆర్కు సపోర్ట్ ఇవ్వకుండా ప్రజల పక్షాన నిలబడాలని హితవు పలికారు.