ఆ 292 మంది పోటీకి అనర్హులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీగా ఛాన్స్ లేనట్లే..!
నల్గొండ : స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాకు చెందిన కొందరు నేతలు ఇరకాటంలో పడ్డారు. అందివచ్చిన అవకాశం ఉపయోగించుకుని ప్రజాప్రతినిధులుగా పోటీచేద్దామనుకుంటే ఆశలు ఆడియాసలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఎంపీటీసీగానో, జడ్పీటీసీగానో గెలుద్దామనుకుంటే అసలుకే ఎసరొచ్చిన పరిస్థితి. గతం తాలూకు నీడ వెంటాడటంతో వారికి ఇలాంటి సిట్యువేషన్ ఎదురైంది.
మీ వాహనాలపై స్టిక్కర్లు అతికించారా?.. ఇకపై చలానా కట్టాల్సిందే..!
వెంటాడుతున్న గతం
ఇదివరకు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీచేసిన కొందరు నేతలకు ఈసారి చేదు అనుభవం ఎదురైంది. నల్గొండ జిల్లాకు చెందిన 292 మంది ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులుగా పేర్కొంది ఎన్నికల సంఘం. ఆ మేరకు ఆదేశాలు జారీచేయడంతో కంగుతిన్నారు సదరు నేతలు.
2014లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేశారు. అప్పుడు ఓడిపోవడంతో ఈ దఫా మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ వారి ఆశలపై నీళ్లు జల్లింది ఈసీ. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 292 మంది అనర్హులంటూ ప్రకటించడం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. అప్పటి ఎన్నికల్లో సదరు నేతలు.. ఎంతమేర ఖర్చు పెట్టారనే వివరాలు ఇవ్వకపోవడంతో సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం అధికారులు అనర్హత వేటు వేశారు.
వేటు పడిందలా..!
ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించిన 292 మందిలో 88 మంది జడ్పీటీసీలుగా పోటీచేశారు. అయితే పోలింగ్ తంతు ముగిశాక ఎన్నికల సమయంలో వారు ఖర్చు పెట్టిన వివరాలు ఈసీకి సమర్పించలేదు. అధికారులు ఎన్నిసార్లు అడిగినా వారి నుంచి స్పందన కరువైంది. అది దృష్టిలో పెట్టుకుని సదరు 88 మందిని ఎన్నికల్లో పోటీచేయరాదంటూ అనర్హులుగా ప్రకటించారు. మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయరాదని ఆదేశాలు జారీచేసింది.
జనవరిలోనే ఈసీ ఆదేశాలు
ఆ 292 మందిలో 88 మంది జడ్పీటీసీలు పోను మిగతావాళ్లు 204 మంది ఎంపీటీసీలు. వీళ్లు కూడా 2014 ఎన్నికల్లో పోటీచేసిన వివరాలు, లెక్కలు ఈసీకి సమర్పించలేదు. మొన్నటి పంచాయతీ ఎన్నికల సమయంలోనే ఎన్నికల సంఘం అధికారులు.. ఈ 292 మంది ఎన్నికల్లో పోటీచేయరాదంటూ ఆదేశించారు. దాంతో కొందరు సర్పంచులుగా పోటీచేద్దామనుకున్నా.. ఈసీ ఆదేశాలు అడ్డుతగిలాయి.
ఈసీ దెబ్బ.. పోటీకి దూరం
పంచాయతీ ఎన్నికల వేళ ఆ 292 మంది అనర్హులంటూ ఎన్నికల సంఘం ప్రకటించడంతో.. వారికి సర్పంచ్ కుర్చీ కూడా దూరమైంది. అందులో కొందరు సర్పంచ్ గిరిపై కన్నేసినా.. ఈసీ నిబంధనలతో పోటీ చేయడానికి కుదరలేదు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఓటమి చెందినవారు ఈసీకి లెక్కలు ఇవ్వాలనే విషయంపై తమకు అవగాహన లేదంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలా 15 మంది వరకు కోర్టు అనుమతితో సర్పంచులుగా పోటీ చేశారు.