హుజుర్నగర్లో కారుదే జోరు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. గెలుపు మాదే అంటున్న కేటీఆర్
నల్గొండ : హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 85 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో కారుదే హవా అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. టీఆర్ఎస్ విజయం ఖాయమని అంచనాలు వెల్లడించాయి. పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ గులాబీకే పట్టం కట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు గెలుపు తమదే అంటూ మంత్రి కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మొదటి నుంచి రసవత్తరం.. కారుకే జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్
హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక మొదట్నంచి కూడా రసవత్తరంగా మారింది. అధికార పక్షమైన టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ కనిపించింది. అయితే ఇండిపెండెంట్ల హవా ఇక్కడి నియోజకవర్గంలో ప్రభావం చూపనుందనే నేపథ్యంలో ఉప ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు చీలుస్తారనే టాక్ వినిపించడంతో గెలుపు ఎవరిదనే విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్స్ పోల్స్ మాత్రం టీఆర్ఎస్కే పట్టం కట్టాయి.
కారు గెలుపా, కాంగ్రెస్ విజయమా.. ఉప ఎన్నిక ప్రశాంతం.. ఇక ఫలితాలపై ఉత్కంఠ..!
కాంగ్రెస్ కంచుకోటలో కారు జోరు తప్పదా?
హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇదివరకు ఆ పార్టీ అభ్యర్థులే చాలాసార్లు గెలుస్తూ వచ్చారు. ఈ క్రమంలో కూడా గెలుపు తమదే అంటూ ఆ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సభ రద్దు కావడం.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్డు షోలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు తమదే అంటున్నారు. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం కారు జోరు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
టీఆర్ఎస్కు పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
హుజూర్నగర్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని ప్రకటించింది ఆరా సంస్థ. టీఆర్ఎస్ పార్టీకి 50.48 శాతం, కాంగ్రెస్కు 39.95శాతం, ఇతరులకు 9.57శాతం విజయవకాశాలు ఉన్నాయని పేర్కొంది. హుజుర్నగర్ నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో సర్వే నిర్వహించిన సదరు సంస్థ కారు జోరు తప్పదనే అంచనాకు వచ్చింది. ఆ మేరకు సర్వే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెల్లడించింది. 85 శాతం పోలింగ్ నమోదైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరగనుంది. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మరో సర్వే సంస్థ మిషన్ చాణక్య అంచనాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 53 శాతం.. కాంగ్రెస్ పార్టీకి 41 శాతం.. బీజేపీకి 1.17 శాతం.. టీడీపీకి 1.80 శాతం ఓట్లు పడే అవకాశముందని రిపోర్టులో పేర్కొంది.
ప్రగతి భవన్ ముట్టడి టెన్షన్ టెన్షన్.. రచ్చ రచ్చ.. ఆర్టీసీ జేఏసీ 10 రోజుల కార్యాచరణ
గెలుపు మాదే అంటూ కేటీఆర్ ట్వీట్.. కార్యకర్తలకు కృతజ్ఞతలు
హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. పోలింగ్ ముగిసిన కాసేపటికి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పుకొచ్చారు. ఏది ఎలా ఉన్నా.. హుజుర్నగర్లో గెలుపు గుర్రం ఎవరనేది మరో మూడు రోజులు ఆగితే ఓటర్ల నాడి నిక్షిప్తమైన ఈవీఎం బాక్సులు తేల్చేస్తాయి.