కొలువు లేదు, ఉన్న భూమి తీసుకున్నారు.. ఆత్మహత్య శరణ్యం, కేటీఆర్కు లేఖ
విద్య దారి చూపుతుందో ఏమో కానీ.. అందరికీ కొలువు మాత్రం ఇవ్వదు. అంటే సర్కార్ కాదే.. ప్రైవేట్ నౌకరీ కూడా కష్టమే. అయితే చాలా మంది తమ వృత్తులు, వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే అలా వ్యవసాయం చేసే ఒకరినీ కూడా చేయనీయలేదు. ఉన్న కాస్త భూమిని అక్రమించేశారు. అదీ కూడా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం కోసం.. ఇంకేముంది అతను మంత్రి కేటీఆర్కు లేఖ రాశారు. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇదీ కాస్త సంచలనంగా మారింది.
ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఆ సదరు రైతు మంత్రి కేటీఆర్ను కోరారు. అతనిది నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ఎడవెల్లి గ్రామం. ఈ మేరకు రైతు చొప్పరి శ్రీను మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నానని తన గోడును వెల్లబోసుకున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు అదొక్కటే ఆదాయ మార్గం అని తెలిపారు.
పల్లె ప్రకృతి వనానికి తన భూమిని తీసుకున్నారని అతను బోరుమన్నాడు. కొంత భూమిని గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం సేకరించారని చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగం లేదని, దీంతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను రోడ్డున పడ్డానని, జీవనం దుర్భరంగా ఉందని వివరించారు.
ఇటు కొలువు లేక.. అటు ఉన్న భూమి తీసుకోవడంతో.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని వివరించారు. చనిపోయేందుకు అనుమతించాలని కోరారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు, కనగల్ తహసీల్దార్ కు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. అందుకే సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకొచ్చానని వివరించారు.