మొదటి భార్య విడాకులు ఇచ్చింది.. మూడో పెళ్లికి రెడీ అయ్యాడు.. రెండో భార్య కొడుకును..!
నల్గొండ : మొదటి భార్య విడాకులు ఇచ్చింది. ఆ క్రమంలో వేరే యువతికి దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. అయితే ఇటీవల రెండో భార్య కూడా విభేదించి తనకు దూరంగా ఉంటోంది. ఆ నేపథ్యంలో మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. దాంతో పెళ్లికి అడ్డు వస్తున్నాడని రెండో భార్యకు పుట్టిన కొడుకును అతి దారుణంగా హత్య చేశాడు. తొలుత పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తులో కసాయి తండ్రి కథ వెలుగుచూసింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
మొదటి భార్య విడాకులు.. రెండో పెళ్లి చేసుకుని
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చింతల కనకయ్యకు మొదటి భార్య విడాకులిచ్చి వదిలేసి పోయింది. ఆమెకు పిల్లలు కలగలేదు. అయితే కుటుంబ గొడవల నేపథ్యంలో కనకయ్యను వద్దనుకుంది. ఆ క్రమంలో హైదరాబాద్కు మకాం మార్చి కూలీపనులు చేసుకుంటున్న తరుణంలో కనకయ్యకు జనగాంకు చెందిన స్వప్న అనే మరో యువతి పరిచయమైంది.
ఆమెను పెళ్లాడి కొన్నాళ్లు సజావుగానే కాపురం చేశాడు. ఆ క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆమెతో కూడా విభేదాలు తలెత్తడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. తనతో పాటు 6 సంవత్సరాల కూతురును వెంట తీసుకెళ్లింది. నాలుగేళ్ల కొడుకు అక్షయ్ను మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు కనకయ్య.
ఈ బుడ్డోడి డ్యాన్స్ మ్యాజిక్కు.. ఇంతకు ఏ మ్యూజిక్కో తెలుసా (వీడియో)
రెండో భార్య వెళ్లిపోయిందని.. మూడో పెళ్లికి సిద్ధం
రెండో భార్య స్వప్న తనను కాదని వెళ్లిపోయిన నాటి నుంచి కనకయ్య తన కుమారుడితో స్వగ్రామంలో ఉన్నాడు. అయితే రెండు నెలల కిందటే శాలిగౌరారం మండలం తిర్మలరాయినిగూడెంలో తన పెద్దనాన్న చింతల రాములు దగ్గరకు వచ్చాడు. అక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో మూడో పెళ్లి ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. పెళ్లి చేసుకుందామంటే కొడుకు అక్షయ్ అడ్డువస్తున్నాడని భావించాడు. దాంతో ఆ పిల్లోడిని చంపేందుకు కుట్ర పన్నాడు.
ఆ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన మందు ఫుల్లుగా తాగొచ్చిన కనకయ్య విచక్షణ కోల్పోయాడు. నాలుగేళ్ల తన కొడుకు అక్షయ్ను అతి దారుణంగా చంపాడు. మెడలు విరిచి, గొంతు నులిమి పాశవికంగా అంతమొందించి పరారయ్యాడు.
మూడో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని..!
రాత్రిపూట అందరూ గాఢ నిద్రలో ఉండగా అక్షయ్ను మట్టుబెట్టాడు కనకయ్య. అయితే మరునాడు ఉదయం కనకయ్య పెద్దనాన్న చింతల రాములు కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి అక్షయ్ విగతజీవిగా కనిపించాడు. ఆ క్రమంలో కనకయ్య కోసం చూడగా అతడు కనిపించలేదు. రాత్రికి రాత్రే కొడుకును చంపి పరారయి ఉంటాడని భావించి పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా శనివారం నాడు తిర్మలరాయిని గూడెంలో పట్టుబడ్డాడు కనకయ్య. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
వాట్సప్తో పోలీసులకు ఫిర్యాదు.. నిర్మల్ జిల్లా ముందడుగు..!
కుదురుగా ఉండని కనకయ్య.. ఎప్పుడూ గొడవలే..!
స్వతహాగా గొడవలు పడే లక్షణాలతో కనకయ్య కుదురుగా ఉండే వాడు కాదంటున్నారు స్థానికులు. అందుకే మొదటి భార్య అతడి వేధింపులు తట్టుకోలేక విడాకులు ఇచ్చిందని చెబుతున్నారు. అయితే స్థానికంగా ఎవరూ తనను నమ్మబోరనే కారణంగా హైదరాబాద్కు వెళ్లి అక్కడ స్వప్న అనే యువతి కుటుంబ సభ్యులకు దగ్గరై వారితో పరిచయం చేసుకుని ఆమెను పెళ్లాడాడు. ఆమెతో కూడా గొడవపడేవాడు. అందుకే రెండో భార్య స్వప్న కూడా దూరమైంది. అందుకే మూడో పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే తన పెళ్లికి రెండో భార్య కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి అభం శుభం తెలియని నాలుగేళ్ల కొడుకును పొట్టనబెట్టుకున్నాడు.