హుజూర్నగర్లో కారుకు అడ్డుగా రోడ్డు రోలర్, ట్రక్కు.. జంకుతున్న గులాబీదళం
హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో కలవరాన్ని పుట్టిస్తోంది. గత ఆరున్నరేళ్లనుండి ఓటమి అంటే తెలియని టీఆర్ఎస్ పార్టీకి భయాన్ని చూపిస్తోంది హుజూర్ నగర్ ఉప ఎన్నిక. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్టు హుజూర్ నగర్ లో కూడా అధికార గులాబీ పార్టీకి అనేక ప్రతికూల పరిస్ధితులు స్వాగతం పలుకుతున్నాయి. అర్ధ బలం, అంగబలం ఉన్నా ప్రజాబలం లేకపోతే ఏమీ చేయలేమనే పరిణామాలు హుజూర్ నగర్ లో చోటుచేసుకున్నాయి. అందుకు తాజాగా ఆర్టీసి కార్మికుల సమ్మె గులాబీ బాస్ కు శరాఘాతంలా పరిణమించింది. దీంతో ఎన్నికలంటే డాషింగ్ గా ఎదుర్కొనే అధికార గులాబీ పార్టీ తొలిసారి వెనకడుగు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
గుబులు పడుతున్న గులాబీ పార్టీ.. హుజూర్ నగర్ లో గట్టెక్కేది ఎలా..?
హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఏ ముహూర్తంలో విడుదలయ్యిందో గాని తెలంగాణ రాజకీయపార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికా గులాబీ పార్టీని హుజూర్ నగర్ ఉప ఎన్నిక వణుకు పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు అనేక కారణాలు అధికార పార్టీకి శరాఘాతంలా పరిణమించాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, రైతుబంధు పథకానికి సంబంధించిన నిధులు సకాలంలో అందడం లేదని, ఎప్పుడు అందుతాయో చెప్పే నాథుడు లేక తెలంగాణ రైతాంగం అయోమయంలో ఉంది.
శరాఘాతంలా మారిన ఆర్టీసి సమ్మె.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి..
ఐతే ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుబంధు సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. ఇది ప్రభుత్వానికి అంతగా మేలు చేసే ప్రక్రియ కాదనే చర్చ కూడా జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసి ఉద్యోగుల సమ్మె, ఉద్యోగాల తొలగింపు అంశాలు చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. దీని ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద పని చేస్తున్నట్టు గులాబీ నేతలు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు.
ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వైఖరి.. తప్పుబడుతున్న ప్రజాసంఘాలు..
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారో ఖరారు కావడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. రెండు పార్టీ శాయశక్తులా పోరాడుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో ఇప్పుడు హుజూర్నగర్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీతో పాటు ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు చీల్చే ఓట్లే ఎవరికి నష్టం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత.. అధికార పార్టీని కలవర పెడుతున్న పార్టీ గుర్తులు..!!
రాజకీయంగా పరిస్ధితులు ఇలా ఉంటే ఎన్నికల కమీషన్ కేటాయించిన గుర్తులు కూడా అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్నికల గుర్తు ఐన కారుతో సారూప్యత ఉన్న ట్రక్కు వల్ల తాము నష్టపోయామని గులాబీ నేతలు వాపోతుండగానే, ఈ ఉప ఎన్నికలోనూ మళ్లీ అలాంటి పరిస్థితే తలెత్తడంతో గులాబీ శిబిరంలో కలవరం మొదలైంది. గత ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థికి ఏకంగా ఏడు వేల ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా అదే ఏడు వేల ఓట్లతో గెలుపొందడం విశేషం. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తులు టీఆర్ఎస్ కు తీవ్ర నష్టం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డు రోలర్, ట్రాక్టర్ నడిపే రైతు గుర్తులు కారు గుర్తును గందరగోళం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అటు రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, ఇటు ఎన్నికల గుర్తులతో నెలకొన్న అయోమయ పరిస్థితుల మద్య గులాబీ పార్టీ నలిగిపోతున్నట్టు తెలుస్తోంది.