మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్... పంచాయితీ చేసి శీలానికి వెలకట్టి పంపించేసిన పెద్దలు
నిర్భయ వంటి చట్టాలు ఎన్ని ఉన్నా,ఎన్ కౌంటర్ లు ఎన్ని జరుగుతున్నా మృగాళ్ల వైఖరి లో ఏ మాత్రం మార్పు రావడం లేదు.తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు. అత్యాచారం అయిన బాలిక శీలానికి వెలకట్టిన ఈ ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి చేస్తుంది.
దిశాఘటన తర్వాత కూడా రెచ్చిపోతున్న మానవ మృగాలు
తెలంగాణ రాష్ట్రంలో బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. దిశ ఘటన తర్వాత కూడా రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకోవడం తెలంగాణ ప్రజలను కలవరపెడుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా దిశ హత్యాచార ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేసి మరీ హతమార్చారు. అయినప్పటికీ ఈ తరహా అత్యాచార ఘటనలు పదే పదే చోటుచేసుకుంటున్నాయి.
నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
తాజాగా తెలంగాణలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లొండ జిల్లా మాడ్గులమల్లి మండలం గుండ్రవానిగూడెంలో ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన బయటకు రాకుండా గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి, నిందితులు వైపున మాట్లాడి బాధితురాలు తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేశారు. అంతేకాదు ఏకంగా గ్రామం నుంచి వారిని పంపించివేసిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.
బహిర్భూమికి వెళ్ళిన సమయంలో ఘటన ..పంచాయితీలో శీలానికి వెల
బహిర్భూమికి బయటకు వెళ్లిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు గ్రామ పెద్దలకు జరిగిన ఘటనను తెలిపి తమకు న్యాయం చేయాలని కోరారు. మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్రేప్ విషయంలో ఆ గ్రామపెద్దలు ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా అక్కడికక్కడే సెటిల్ చేశారు. అయితే ఈ విషయం ఆ నోట ఈనోట బయటికి రావడంతో ఇప్పుడు ఈ గ్యాంగ్ రేప్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది.
తప్పు చేసి మరీ గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్న కామాంధులు
దీంతో గ్రామ పెద్దలు పంచాయతీ చేసి బాధితురాలి కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పి గ్రామం నుంచి పంపించేశారు. అయితే ఈ విషయం కాస్త పోలీసుల దాకా చేరడంతో గ్రామస్తులను, గ్రామ పెద్దలను పోలీసులు విచారిస్తున్నారు. గ్రామాలలో ఇప్పటికీ అత్యాచార ఘటనలు జరిగితే ఈ తరహాలో శీలానికి వెల కట్టడం పరిపాటిగా మారిపోయింది. అత్యాచారాలకు పాలప్డిన వారు మాత్రం డబ్బులు ఇచ్చి యధేచ్చగా గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్నారు.