హాజీపూర్ సైకో శీను కేసులో ఛార్జ్ షీట్.. ఉరిశిక్ష పడేనా?
నల్గొండ : హాజీపూర్ సైకో శీనుగాడి ఉదంతం రాష్ట్రాన్ని కుదిపేసింది. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి పాశవికంగా చంపిన ఘటనలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం చర్చానీయాంశమైంది. దాంతో నిందితుడికి ఉరిశిక్ష పడుతుందా లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారా అనే కోణంలో ఉత్కంఠ నెలకొంది. సైకో శీనుగాడి దురాగతాలపై హాజీపూర్ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని.. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో కలకలం.. ముగ్గురు బాలికలను అతి దారుణంగా..!
హాజీపూర్ సైకో శీను గాడి అరాచకాలతో తెలంగాణలో కలకలం రేగింది. బైకుపై లిఫ్ట్ ఇచ్చి ముగ్గురు బాలికలను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు వెలుగుచూడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. సీరియల్ కిల్లర్గా వాడి దురాగతాలకు హాజీపూర్ గ్రామస్తులు మండిపడ్డారు. వాడికి ఉరిశిక్ష సరైన శిక్ష అంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనలు కూడా చేశారు. మంత్రులు మహమూద్ అలీతో పాటు ఈటల రాజేందర్ను కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు.
ఆ క్రమంలో తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ, కేసు విచార అధికారి భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ముగ్గురు బాలికలను అతి కిరాతకంగా చంపిన సైకో శీను గాడి కేసులో నిర్ణీత 90 రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు.
తెలంగాణ ప్రభుత్వం కరెంటు బాకీలు.. ఎన్ని కోట్లంటే.. కష్టాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు..!
దర్యాప్తు పూర్తి.. ఛార్జ్ షీట్ దాఖలు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలపై అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి ఆ తర్వాత వారిని హత్య చేశాడు. వారిని పాడుబడ్డ బావిలో పడేసి మళ్లీ ఏమి తెలియనట్లుగా గ్రామస్తులతో కలివిడిగా తిరిగాడు. ఏ మాత్రం తనమీద అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఏప్రిల్ నెలలో పాముల శ్రావణి హత్యోదంతంతో సైకో శీనుగాడి లీలలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆ కేసులో వాడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తే మనీషా, కల్పన అనే మరో ఇద్దరు బాలికలను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు.
కోర్టు తీర్పుపై ఉత్కంఠ.. ఉరే సరైన శిక్ష అంటూ..!
శ్రావణి కేసుతో సైకో శీనుగాడి బండారం బయటపడింది. లిఫ్ట్ ఇస్తానంటూ తన బైక్పై ఎక్కించుకుని గ్రామంలోకి తీసుకెళ్లకుండా ఓ పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. మళ్లీ ఏమి ఎరుగనట్లు గ్రామస్తులతో కలిసి అదే బావి దగ్గరకు వెళ్లి అయ్యో పాపం అన్నట్లుగా నటించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో అడ్డంగా బుక్కయ్యాడు. దాంతో సైకో శీనుగాడి మరికొన్ని దారుణాలు వెలుగుచూశాయి.
శ్రావణి హత్యోదంతం తర్వాత వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి అలియాస్ సైకో శీనుగాడిపై బుధవారం నాటికి దర్యాప్తు పూర్తిచేసి పూర్తి ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. అయితే కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అమాయక ఆడపిల్లల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న సైకోగాడికి ఉరే సరైన శిక్ష అంటూ గ్రామస్తులు కోరుకుంటున్న వేళ.. నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందోననేది చర్చానీయాంశంగా మారింది.