సైకో శీనుగాడిపై కుటుంబ సభ్యుల్లో అసహ్యం.. కొడుకును ఉరి తీయాలంటున్న తండ్రి
నల్గొండ : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను పాశవికంగా హత్యాచారాలు చేసిన సైకో శీనుగాడి ఉదంతం రాష్ట్రవ్యప్తంగా సంచలనం రేపింది. హాజీపూర్ గ్రామస్తులు వాడు కనిపిస్తే చంపేయాలన్నంత కసిగా ఉన్నారు. ఇదివరకే వాడి ఇల్లును తగులబెట్టారు. అదంతా ఒకెత్తయితే.. స్వయానా తండ్రి, అన్న వాడు నీచుడంటూ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సైకో శీనుగాడి ఉదంతం వెలుగుచూశాక బయటి వ్యక్తులే కాదు.. సొంత ఇంటోళ్లే వాడంటే అసహ్యించుకుంటున్నారు. గ్రామస్తుల డిమాండ్ ప్రకారమే వాడిని ఉరి తీయాలని కోరుతున్నారు.
హాజీపూర్ ఉదంతంపై సీఎం కేసీఆర్ బాధపడ్డారు.. సైకో శీనుగాడికి కఠిన శిక్ష ..! కేటీఆర్ హామీ
గ్రామస్తులే కాదు.. కుటుంబ సభ్యులకు అంతే కోపం..!
హాజీపూర్ సైకో శీనుగాడి అరాచకాలు బయటపడ్డాక.. గ్రామస్తులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదో కేసులు పెట్టి జైల్లో కూర్చోబెట్టడం కాదని.. వాన్ని ఉరితీయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఆ క్రమంలో సైకో శీనుగాడి తండ్రి, అన్న కూడా అదే విషయం మాట్లాడటం చర్చానీయాంశమైంది.
ఇంట్లో వారితో సాధారణంగా ఉండే తన కొడుకు శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి దురాగతాలకు పాల్పడతాడని కలలో కూడా ఊహించలేదంటున్నారు అతడి తండ్రి బాల్రెడ్డి. తమ గ్రామానికే చెందిన ముగ్గురు బాలికలను పొట్టనపెట్టుకున్న ఆ కఠినాత్ముడికి ఉరిశిక్ష విధించాలని కోరారు.
వాన్ని ఉరి తీయండి..! తండ్రి ఆవేదన
సైకో శీనుగాడి అన్న సుధాకర్ రెడ్డి కూడా వాడిపై అసహ్యం పెంచుకున్నారు. శ్రావణి హత్య జరిగిన రోజు గ్రామస్తులు బావి దగ్గర వెతుకుతుంటే నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తనతో పాటే ఉన్నాడని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో వాడి మొహంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవన్నారు. అసలు ఏమాత్రం భయాందోళన కనిపించకుండా జాగ్రత్తపడ్డాడని తెలిపారు.
సోదరుడైనప్పటికీ నేరం చేసినవాడిని వెనుకేసుకురావడం తనకు ఇష్టం లేదన్నారు. వాడు చేసిన పాపానికి తనతో పాటు తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. ఆ సమయంలో రావిరాలలోని బంధువుల ఇంట్లో దాక్కున్న శ్రీనివాస్ రెడ్డిని పట్టించింది తానేనంటూ చెప్పుకొచ్చారు. ఉరిశిక్ష కంటే ఇంకా పెద్ద శిక్ష ఏదైనా ఉంటే అదే వేయాలని కోరారు.
బస్సు సౌకర్యం లేక..!
సభ్య సమాజంలో జీవిస్తున్నామనే విచక్షణ కోల్పోయి శ్రీనివాస్ రెడ్డి అడ్డూ అదుపులేకుండా రెచ్చిపోయాడు. హాజీపూర్ గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేకపోవడం వాడి చెడు ఆలోచనలకు ఊతమిచ్చినట్లైంది. ఆ దారిలో లిఫ్ట్ పేరిట నాలుగైదు సార్లు బైక్ ఎక్కించుకుని.. వారికి కాస్తా నమ్మకం కుదిరాక వాడిలోని రాక్షసుడిని నిద్రలేపేవాడు. హత్యాచారాలు చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు గ్రామస్తులతో కలిసిపోయేవాడు. మొత్తానికి వాడు ఛస్తే తప్ప తమకు మనశ్శాంతి ఉండదని అటు బాధిత కుటుంబాలు అంటుంటే.. వాడి సొంత తండ్రి, అన్న కూడా అదే మాట్లాడటం చర్చానీయాంశమైంది.