హాజీపూర్ సీరియల్ కిల్లర్.. లిఫ్ట్ ఇచ్చి హత్యాచారాలు.. నిందితుడి ఇంటికి నిప్పు
భువనగిరి : పచ్చని పల్లెలో చిచ్చు రేపాడు. అమాయక యువతులను పాశవికంగా అత్యాచారం చేసి హత్యలకు పాల్పడ్డాడు. మళ్లీ ఏమీ ఎరుగనట్లు ఆ ఊళ్లోనే తిరిగాడు. చివరకు శ్రావణి హత్యోదంతంతో ఆ నీచుడి నేరాల చిట్టా బయటపడింది. దాంతో బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అతడి ఇంటికి నిప్పు పెట్టారు. ఎండాకాలం కావడంతో క్షణాల్లో ఆ ఇల్లు కాలి బూడిదైంది.
ఏకగ్రీవంలో ఇంత కథ ఉందా?.. 10 లక్షల బేరం.. కాంగ్రెస్ అభ్యర్థి క్యాష్ ప్రూఫ్
గ్రామస్థుల ఆగ్రహం.. నిందితుడి ఇంటికి నిప్పు
బొమ్మల రామారం మండలం పరిధిలోని గ్రామాల్లో కొన్నాళ్లుగా యువతులు కనిపించకుండా పోతున్నారు. అయితే శ్రావణి హత్యోదంతంతో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి దుర్మార్గాలు బయటపడుతున్నాయి. తాజాగా మనీషా అనే మరో యువతి మృతదేహం లభ్యం కావడం ఆందోళనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఎంతమంది యువతుల ప్రాణాలు తీశాడోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు హత్యలు తానే చేశానని పోలీసుల దర్యాప్తులో నిందితుడు ఒప్పుకోవడంతో గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు అంటించడంతో క్షణాల్లో కాలి బూడిదైంది.
వరుస హత్యల కలకలం
హాజీపూర్ కు చెందిన శ్రావణి, మనీషా సీరియల్ కిల్లింగ్ మిస్టరీ వీడింది. ఏసీ మెకానిక్ శ్రీనివాస్ రెడ్డి ఈ రెండు హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసిన అనంతరం హత్యకు పాల్పడినట్లు తేల్చారు. అయితే హాజీపూర్ కే చెందిన మరో బాలిక కల్పన అదృశ్యం మిస్టరీగా మారింది. నాలుగేళ్ల కిందట కనిపించకుండా పోయిన కల్పన జాడ ఇంతవరకు తెలియలేదు. అదలావుంటే అటు ఆంధ్ర ఫామ్ హౌజ్ కు చెందిన మహిళ కూడా కనిపించకుండా పోయింది. వీరి అదృశ్యం వెనుక శ్రీనివాస్ రెడ్డి హస్తముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల సమక్షంలో ఆమెను కూడా తానే హత్యచేసినట్లు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అదే బావిలో..!
శ్రావణి కనిపించకుండా పోవడం.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడం.. ఇదంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మీడియాలో కథనాలు రావడంతో పోలీసాధికారులు అలర్టయ్యారు. శ్రావణి మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో.. హాజీపూర్ - మైసిరెడ్డి పల్లి దారిలో ఉన్న ఓ బావిలో ఆమె మృతదేహం గుర్తించారు.
అంతేకాదు మనీషా అనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యువతి మృతదేహం కనిపించడం దుమారం రేపింది. రెండు నెలల కిందట కనిపించకుండా పోయిన మనీషా కోసం కుటుంబ సభ్యులు వెతికి వెతికి ఇక లాభం లేదనుకుని చాలించుకున్నారు. అయితే ఇలా బావిలో శవమై కనిపించడం చర్చానీయాంశమైంది.
లిఫ్ట్ ఇచ్చి.. ప్రాణాలు తీసి
నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఎందుకిలా రెచ్చిపోయాడు. అంత ఈజీగా ఆ యువతులు అతడిని ఎట్లా నమ్మారు. ఇలాంటి ప్రశ్నలకు ఒకటే సమాధానంగా కనిపిస్తోంది. ప్రధానంగా హాజీపూర్ గ్రామానికి బస్సు సర్వీసులు లేవు. ఆ క్రమంలో గ్రామస్థులు ఆ రూట్లో వెళ్లే వాహనదారులను లిఫ్ట్ అడిగి వెళుతుంటారు. ఇదే అంశం నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి కలిసి వచ్చినట్లైంది. అలా లిఫ్ట్ ఇచ్చి యువతులపై హత్యాచారాలు చేసినట్లు తెలుస్తోంది.
శ్రావణి, మనీషా కూడా ఇలాగే హత్యలకు గురై ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లోనూ చాలామంది యువతులు మిస్సింగ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వారి అదృశ్యం వెనుక శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉందేమోననే అనుమానాలు బలపడుతున్నాయి.