హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరం.. బరిలో తీన్మార్ మల్లన్న.. పార్టీల వ్యూహామేంటో?
నల్గొండ : హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోరు నడుస్తుంటే మధ్యలో బీజేపీ, టీడీపీ, సీపీఎం కూడా ఈ స్థానంపై కన్నేశాయి. అదంతా అలా ఉంటే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేక గళం వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న కూడా నేను సైతం అంటూ రంగంలోకి దిగడం చర్చానీయాంశమైంది. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా.. 70 ఏళ్ల నుంచి ఓడిపోతున్న ప్రజలను గెలిపించడమే లక్ష్యమంటూ కొత్త నినాదం అందుకుని బరిలో దిగబోతున్నారు. ప్రధాన పార్టీలే నువ్వా నేనా అంటూ కసిగా కనిపిస్తున్న తరుణంలో తీన్మార్ మల్లన్న వ్యూహామేంటో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్.. మధ్యలో మరికొందరు
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ క్రమంలో హుజుర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక ఆనివార్యమైంది. అయితే బై పోల్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి రంగంలోకి దిగారు. అటు అధికారపక్షమైన టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి సై అంటున్నారు.
గెలుపు కోసం టీఆర్ఎస్ ప్రయత్నం
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన హుజుర్నగర్లో ఎలాగైనా గెలవాలని పంతం పట్టింది టీఆర్ఎస్. ఆ మేరకు సీనియర్ నేతలను ఇక్కడ మోహరించి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ మేరకు విజయావకాశాలపై కన్నేసింది. అయితే నువ్వా నేనా అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుంటుంటే మధ్యలో నైను సైతం అంటూ బీజేపీ కూడా పోటీకి సై అంది. ఆ క్రమంలో సీపీఎం కూడా తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.
టీడీపీ సైతం రంగంలోకి
అదంతా అలా ఉంటే.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టి తెలుగుదేశం పార్టీ మహాకూటమిగా రంగంలోకి దిగింది. అయితే ఈసారి ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ పార్టీని కాదంటోంది. పోటీలో మేము కూడా ఉంటామంటూ ప్రకటించింది. ఆ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం ఓకే చెప్పారు. నల్గొండ జిల్లాతో టీడీపీకి అవినాభావ సంబంధం ఉందని.. హుజుర్నగర్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లా నేతలంతా పోటీ చేయాలని పట్టుబడుతుండటంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. సోమవారం (30.09.2019) నాడు టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తీన్మార్ మల్లన్న ఎంట్రీ
ఇక టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ.. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ సైతం హుజుర్నగర్ ఉప ఎన్నికకు సిద్ధమయ్యారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కూడా సోమవారం నాడే నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను ఓడించడానికి తాను పోటీ చేయడం లేదని.. 70 ఏళ్లుగా ఓడిపోతున్న ప్రజలను గెలిపించడానికి తాను రంగంలోకి దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యార్థులు, మేధావులు, కుల సంఘాలు, యువజన సంఘాలు, కొన్ని పార్టీల మద్దతుతో తాను బై పోల్స్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఓట్లు చీలిపోవడం ఖాయం.. తీన్మార్ మల్లన్న ఆశలేంటో?
కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇంత మంది పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయనే టాక్ వినిపిస్తోంది. అదలావుంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ రెడ్డి అభ్యర్థులను బరిలోకి దించగా.. బీసీ కులానికి చెందిన తీన్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాల ఓట్ల మీద ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు ఆయనకు ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఖర్చుల కోసం ఛాయ్ పైసలు కేవలం 10 రూపాయలైనా తనకు సాయం చేయాల్సిందిగా మల్లన్న అభ్యర్థించడం కొంత వరకు వర్కవుట్ అయేటట్లు కనిపిస్తోంది సిట్యువేషన్.