హుజూర్ నగర్ ఎన్నికల్లో మళ్ళీ గులాబీ పార్టీకి గుర్తుల పరేషాన్
హుజూర్నగర్ ఉపఎన్నికల పోరు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. హుజూర్ నగర్ ఓటర్ల మనసు గెలుచుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న హుజూర్ నగర్ లో వారి ఓటు బ్యాంకు కీలకం కానుంది.
కేసీఆర్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లినందుకే పొత్తులు..!హుజూర్ నగర్ లో టీడిపి ప్రభావం ఉంటుందన్న కిరణ్మయి..!
హుజూర్ నగర్ లో జెండా ఎగరెయ్యాలని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది . గులాబీ పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే .ఇక ప్రచారంలోనూ వ్యూహాలను అనుసరిస్తూ ఈసారి గులాబీ జెండా ఎగరెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు. అయితే ఇప్పుడు మరో సమస్య టీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఓట్లు తగ్గడానికి స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు కారణం అని గుర్తించిన నేతలు కారును పోలిన గుర్తులు ఇవ్వకుండా ఉండాలని ఎన్నికల కమీషన్ కు లిఖిత పూర్వక లేఖను సైతం ఇచ్చారు. గత ఎన్నికల్లో రోడ్ రోలర్ కారు ఓటు బ్యానుకు కొల్లగొట్టి ఓటమికి కారణం అయ్యింది.
ఇక గులాబీ నేతలు రోడ్ రోలర్ , ట్రాక్టర్, ఆటో గుర్తులు తమ పార్టీని వెంటాడుతున్నాయని అంటున్నారు. అచ్చం కారు గుర్తులాగే ఉండి.. తమ ఓట్లకు గండికొట్టాయని వారు వాపోతున్నారు. ఇప్పుడు హుజూర్ నగర్ బై ఎలక్షన్స్లో కూడా అదే సమస్య గులాబీ నేతలను వేధిస్తుంది. హుజూర్ నగర్ బరిలో 28 మంది ఉన్నారు. వారిలో 24 మంది స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు. మిగతా నలుగురు.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు చెందిన వారు. ఆ తరువాత 5వ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి మహేష్ ఉన్నారు. ఎన్నికల సంఘం ఆయనకు ట్రాక్టర్ గుర్తు కేటాయించింది. దీంతో.. టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ నెలకొంది .
ప్రజలు ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా తమ ఓట్లు పోయే అవకాశమున్నందున ముందుగానే జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు . ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారని సమాచారం .ట్రాక్టర్ గుర్తు బదులు వేరే గుర్తు కేటాయించాలని కుదరని పక్షంలో తమ పార్టీ గుర్తైన కారును మరింత ముదురు రంగులో ఉంచాలని వినతిపత్రం ఇచ్చారు ఎంపీ వినోద్ కుమార్. ఈ విషయంపై స్పందించిన ఎన్నికల సంఘం ట్రాక్టర్ గుర్తు రద్దు చేసే అవకాశం లేదని తేల్చేసింది. దీంతో గులాబీ నేతలు ఈసారి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి గత ఎన్నికల్లోనే కాదు ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి గుర్తుల టెన్షన్ వీడలేదని తెలుస్తుంది