హుజూర్నగర్ ఉపఎన్నికల్లో ఉత్తమ్, పద్మావతి ప్రలోభాలు: సాక్ష్యాలతో ఫిర్యాదు
నల్గొండ: హుజూర్నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి, ఆమె భర్త, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
అంతేగాక, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సాక్షాధారాలతో మూడు వినతి పత్రాలు సమర్పించారు. ఎం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు దండె విఠల్. ఎన్నికల్లో గెలిచేందుకు తప్పుదారిలో వెళుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరికలు
హుజూర్నగర్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇక బీజేపీ, టీడీపీలో కూడా బరిలో ఉండి సత్తా చాటాలనుకుంటున్నాయి. అయితే, ప్రధాన పోటీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మద్యే ఉండే అవకాశం ఉంది.
తాజాగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపాలిటీలోని పలు వార్డులకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ వారికి గులాబీ కండువాల కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అక్టోబర్ 24న ఈసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది. అక్టోబర్ 21న హుజూర్నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుందని తెలిసిన విషయమే.
ఇది ఇలా ఉండగా, టీఆర్ఎస్ పార్టీకి హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఇప్పటికే సీపీఐ పార్టీ మద్దతు తెలుపగా, ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ జనసేన మద్దతు కోరుతుండగా.. ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. టీడీపీ, బీజేపీ పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి.