అర్హులకు డబుల్బెడ్ రూం ఇళ్లు, 15 రోజుల్లో మళ్లీ వస్తా, అభివృద్ధికి కట్టుబడ్డానన్న కేసీఆర్
హుజూర్నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గ వెనుకబాటుకు గత పాలకులే కారణమని విమర్శించారు. నాలుగున్నరేళ్ల కాలంలో అభివృద్ధి పుంతలు తొక్కించామని స్పష్టంచేశారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ విజయం తర్వాత ప్రజా కృతజ్ఞత సభలో నియోజకవర్గ సమస్యలను తీరుస్తామని హామీనిచ్చారు.
సంక్షేమమే పరమావధి..
నియోజకవర్గంలో ఉన్న అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. హుజూర్నగర్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పి.. సభ వేదికనుంచి కేసీఆర్ ప్రకటించారు. వాస్తవానికి రూ.100 కోట్ల నిధులను ప్రకటించామని పేర్కొన్నారు. కానీ సైదిరెడ్డి మరో జాబితా ఇచ్చి నియోజకవర్గంపై తనకు ఉన్న ప్రేమను చాటుకొన్నారని తెలిపారు. సైదిరెడ్డి హుషారు ఉన్నాడని సభ వేదికపై నుంచి కేసీఆర్ అంటుండగా కార్యకర్తలు కేరింతలు కొట్టారు.
అర్హులకు సంక్షేమ ఫలాలు
గత పాలకులు హుజూర్నగర్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శలు చేశారు. 60 ఏళ్లలో ఏ ఒక్క పనిచేయలేదని మండిపడ్డారు. కనీసం గిరిజన రెసిడెన్షియల్ ఏర్పాటుచేయలేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ ప్రతీనబూనారు. ఇచ్చిన హామీలే కాక.. ఇవ్వని, తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని చెప్పారు.
ఏం మారలేదు
గతంలో దివంగత ఎన్టీఆర్ హయంలో తాను కరువు మంత్రిగా పనిచేశానని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అప్పడు ఉన్న సమస్యలు నేటికి కనిపిస్తున్నాయని చెప్పారు. సో కాల్డ్ నేతలు ఆ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పనిచేసి చేసిందేమీ లేదన్నారు. తనకు ఆ పోస్ట్, ఈ పోస్ట్ అంటూ ఉదరగొట్టారే తప్ప నియోజకవర్గానికి చేసిందేమి లేదని మండిపడ్డారు. అందుకోసమే ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని చెప్పారు.
కోటి ఎకరాల మగాణి
రాష్ట్రాన్ని కోటి ఎకరాల మగాణి చేస్తామని కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి గోస తీరుతుందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రెండుపంటలకు నీరందుతుందని చెప్పారు. రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు. మరో 15 రోజుల్లో హుజూర్నగర్లో పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు. కల్వర్ట్, లిప్టుల నిర్మాణం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.