40 ఏళ్లలో చేయనిది 4 ఏళ్లలో చేశాం.. హుజూర్నగర్కు ఉత్తమ్ చేసిందేమీ లేదన్న కేటీఆర్
హుజూర్నగర్ను దశాబ్ధాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ హుజూర్నగర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కోసం ప్రచారం నిర్వహించారు. మంత్రి జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సైదిరెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు.
కారు జోరు
హుజూర్నగర్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గ ముఖచిత్ర మార్చాలనే తపన ఉన్న నాయకుడు సైదిరెడ్డి అని పేర్కొన్నారు. ఇక్కడ జనం ఊపు చూస్తే టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందన్నారు. తమ ర్యాలీని ఉత్తమ్ చూస్తే పెట్టేబేడా సర్దుకుంటారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వస్తోన్న ఆదరణను చూసి కాంగ్రెస్ నేతల గుండెల్లో గుబులు మొదలైందన్నారు.
మాటలేనా ..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని గతంలో ఉత్తమ్ చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. సీఎం అవుతానని, కేంద్రమంత్రి అవుతానని చెప్పి ఓట్లు వేయించుకున్న చరిత్ర ఉత్తమ్కుమార్ది అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయాల్సిన పనులే చేయలేదన్నారు. కానీ ఐదేళ్లలో హుజూర్నగర్ ముఖచిత్రమే మారిందని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనలు చేయించిందని పేర్కొన్నారు.
అభివృద్ధే పరామావధి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీతో కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్కు ఓటేస్లే సంక్షోభమే శరణ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్లలో చేయనిది 4 ఏళ్లలో చేసి చూపించామని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు ఉద్యమంలో పనిచేశారని, అప్పుడు ఉత్తమ్ ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు.