హుజుర్నగర్ ఎన్నికలపై డేగ కన్ను.. ఓటర్లను ప్రభావితం చేస్తే అంతే సంగతి..!
సూర్యాపేట : హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నువ్వా నేనా అనే తీరుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో హుజుర్ నగర్ మాదంటే మాదంటున్నారు ఇరు పార్టీల నేతలు. ఇక బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్లు ఎవరికి వారుగా గెలుపు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న ఎన్నికల కోసం అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హెచ్చరించారు.
హుజుర్ నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాతో పాటు అనధికారిక గోడౌన్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. ఆ క్రమంలో మరింత నిఘా పెంచాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కమర్షియల్ టాక్స్ నల్గొండ డివిజన్ జాయింట్ కమిషనర్ దీపారెడ్డి తెలిపారు.
ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
కోదాడ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. నోడల్ ఆఫీసర్గా డిప్యూటీ కమిషనర్ పి రామలక్ష్మయ్యను నియమించినట్లు తెలిపారు. వస్తువుల రవాణాలో సంబంధిత పత్రాలు సరిగా లేకుంటే సీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక డిప్యూటీ కమిషనర్ ఏడుకొండలు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అనధికార గోడౌన్స్ సమాచారం గానీ.. అక్రమ వస్తువుల రవాణా వివరాలు గానీ ఎవరి దృష్టికైనా వస్తే 7702100775 ఫోన్ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు దీపారెడ్డి. అటు రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసుల సహకారం తీసుకుంటామని వివరించారు.