హుజుర్నగర్ బై పోల్స్పై ఉత్కంఠ.. 70 శాతం పోలింగ్.. ఇంకా పెరిగే ఛాన్స్..!
నల్గొండ : హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఆ మేరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఆయా పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూలైన్లో నిల్చున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైన తరువాత రెండు గంటల సేపు మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది.
ఉదయం 9 గంటల సమయానికి కేవలం 13.44 శాతం ఓటింగ్ నమోదైంది. 11 గంటల వరకు 31.34 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకంగా 52.89 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. మధ్యాహ్నం 3 గంటలకు చూసినట్లయితే అది కాస్తా 70 శాతానికి పెరిగింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 88 శాతం పోలింగ్ రికార్డైంది. అదలావుంటే ఈసారి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందనేది ఎన్నికల సంఘం అధికారుల అంచనా.
ప్రగతి భవన్ ముట్టడి టెన్షన్ టెన్షన్.. రచ్చ రచ్చ.. ఆర్టీసీ జేఏసీ 10 రోజుల కార్యాచరణ
హుజుర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉన్నారు. ఆ మేరకు 302 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఒకటి రెండు ఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు తెలుస్తోంది. అదలావుంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2 వేల 350 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు చేపట్టింది పోలీస్ శాఖ. ఆరు కంపెనీల కేంద్ర బలగాలతో పాటు తెలంగాణ స్పెషల్ పోలీస్ తదితర విభాగాలు ఉప ఎన్నికల సందర్భంగా సేవలు అందించాయి.