హుజుర్ నగర్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగేనా.. ఒంటి గంట వరకు ఎంతంటే..!
నల్గొండ : హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు.
ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి రెండు గంటల వ్యవధిలో అంటే 9 గంటల వరకు 13.44 శాతం ఓటింగ్ నమోదైంది. అదే 11 గంటల సమయంలో చూస్తే 31.34 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకంగా 52.89 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఓటింగ్కు ఇంకా నాలుగు గంటల సమయం ఉండటంతో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి యత్నం.. ఫుల్లుగా ట్రాఫిక్ జామ్.. ఆర్టీసీ జేఏసీ 10 రోజుల కార్యాచరణ
హుజుర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల స్పెషల్ ఆడిట్ పరిశీలకులు జీకే గోక్లానీ చింతలపాలెం మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం పరిశీలించారు. అదలావుంటే ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మహారాష్ట్ర, హర్యానాలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. తెలంగాణలో జరుగుతున్న హుజుర్ నగర్ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అధికారపక్షమైన టీఆర్ఎస్, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. అయితే ఈ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారీగా ఓట్టు కొల్లగొట్టిన సందర్భాలున్నాయి. దాంతో గెలుపు ఎవరిదని చెప్పడం కష్టతరంగా మారింది.