నల్గొండ జిల్లాలో ఇంటర్ సైకో వీరంగం.. కత్తితో దాడి, ఒకరి మృతి
నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంటర్ విద్యార్థి రెచ్చిపోయాడు. సైకోలా మారి కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చినికి చినికి గాలివానలా మారిన చిన్న గొడవ హత్యకు దారితీసింది. బుధవారం నాడు రాత్రి జరిగిన ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
చదివేది ఇంటర్.. కత్తి చేతబట్టి
నల్గొండ జిల్లాలోని కనగల్ మండలం దోరేపల్లికి చెందిన పసునూరి ప్రవీణ్ (18సం.) సైకోలా మారాడు. చిన్న గొడవ కారణంగా లక్ష్మణ్ (17) అనే మైనర్ యువకుడ్ని పొట్టన పెట్టుకున్నాడు. బుధవారం రాత్రి బస్టాండ్ దగ్గర జరిగిన గొడవలో.. ప్రవీణ్ కత్తితో దాడి చేయడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే చనిపోయాడు. అడ్డొచ్చిన మరో ముగ్గురిపై కూడా దాడిచేయడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి.
చిన్న గొడవ.. ప్రాణం బలి
దోరేపల్లికి చెందిన పసునూరి ప్రవీణ్ కు, బరపాటి లక్ష్మణ్ కు వారం రోజుల కిందట చిన్న గొడవ జరిగింది. అది మనసులో పెట్టుకున్న ప్రవీణ్.. లక్ష్మణ్ మీద పగ తీర్చుకునేలా అదను కోసం వెయిట్ చేశాడు. ఆ క్రమంలో బుధవారం రాత్రి బస్టాండ్ దగ్గర ప్రవీణ్ కూర్చుని ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి పని నిమిత్తం లక్ష్మణ్, తన అన్న చందుతో కలిసి బస్టాండ్ దగ్గరకు వచ్చాడు. లక్ష్మణ్ ను చూసిన ప్రవీణ్ రెచ్చిపోయి మాట్లాడాడు. ఆ క్రమంలో వారి మధ్య మళ్లీ గొడవ రాజుకుంది. దీంతో లక్ష్మణ్ తన సమీపబంధువులైన శ్రీధర్, శివాజీకి ఫోన్ చేసి రమ్మన్నాడు. వారు అక్కడకు చేరుకున్న తర్వాత వివాదం మళ్లీ ముదిరింది. లక్ష్మణ్, చందు, శ్రీధర్, శివాజీతో ఘర్షణ పడ్డ ప్రవీణ్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు.
సోషల్ మీడియా, సినిమాల ప్రభావమా?
ఆ నలుగురితో గొడవపడ్డ ప్రవీణ్.. ఒక్కసారిగా ఉన్మాదిలా మారాడు. వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మణ్ పై దాడికి దిగాడు. కత్తిపోటు ఛాతీలో బలంగా తాకడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత చందు, శ్రీధర్, శివాజీపై కూడా దాడి చేయడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న ప్రశాంత్ అనే యువకుడు ప్రవీణ్ ను పట్టుకునే క్రమంలో తప్పించుకుని పారిపోయాడు. విషయం తెలిసి గ్రామానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని నల్గొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అందులో చందు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు పోలీసులు. లక్ష్మణ్ మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ, హత్య జరిగిన తీరుపై జిల్లా ఎస్పీ వివరాలు సేకరిస్తున్నారు. ప్రవీణ్ కత్తితో రెచ్చిపోయిన తీరు చూస్తుంటే.. సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం ఉందన్నట్లుగా అభిప్రాయపడ్డారు.