లంచం ఇవ్వొద్దు.. నెలన్నర ఓపిక పట్టండి.. రైతుల బాధలు తీరుస్తా : కేసీఆర్
నల్గొండ : ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వాల్సిన పని లేదన్నారు సీఎం కేసీఆర్. నెలన్నర రోజులు ఓపిక పడితే రైతుల బాధలు తీర్చే బాధ్యతను తానే తీసుకుంటానన్నారు. మిర్యాలగూడలో జరిగిన నల్గొండ లోక్సభ సెగ్మెంట్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేపట్నుంచి ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లాకు చెందిన యువరైతుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత తన కార్యాలయానికి పెద్దసంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. రైతుబిడ్డను కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది తనకు తెలుసని.. 45 రోజులు ఓపిక పడితే వ్యవస్థను మార్చేస్తానంటూ హామీ ఇచ్చారు.
మోడీ సైన్యంలో సైనికురాలిని.. పాలమూరును గెలిచి కానుకగా ఇద్దాం : డీకే అరుణ
భూములకు పట్టాలు చేసుకోవడం, ఇంటి నెంబర్లను తమ పేర్ల మీదకు మార్చుకునే మ్యూటేషన్లు.. ఇలాంటి పనులు ఏవైనా ఉంటే నెలన్నర రోజులు పెండింగ్ లో పెట్టుకోవాలని సూచించారు. జూన్ నెలలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రైతుల సమస్యలు తీర్చుతానని.. అంతవరకు ఓపిక పట్టాలని కోరారు. నా మాట వినండి.. ఈ నెలన్నర రోజులు కూడా ఎవరికీ రూపాయి లంచం ఇవ్వొద్దని సూచించారు. జూన్ లో తాను తీసుకోబోయే విప్లవాత్మకమైన నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. రైతు సమస్యలు, పోడు భూముల సమస్యలు తదితర విషయాల్లో రైతులకు న్యాయం జరిగేదాకా నిద్రపోనంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అధికారులను కూడా నిద్రపోనివ్వనంటూ చెప్పుకొచ్చారు.