కేసీఆర్ సభకు కాంగ్రెస్ విన్నింగ్కు లింక్ ఉందా.. గెలుపుపై ధీమా మరింత పెరిగిందా..?
నల్గొండ : హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు బరిలో దిగారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే కనిపిస్తోంది. అధికార పక్షమైన టీఆర్ఎస్.. రాష్ట్రంలో అంతో ఇంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ మధ్యే టఫ్ ఫైట్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఏది కనిపించినా, మరేదో వినిపించినా హుజుర్ నగర్ మాత్రం మాదే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక హుజుర్ నగర్లో సీఎం కేసీఆర్ సభ రద్దు కావడం హస్తం గూటిలో మరింత జోష్ కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది.
ఒక్క ఎమ్మెల్యే కోసం ఎన్ని కష్టాలో..!
హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ ఖాతాలో 88 స్థానాలు పడ్డాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందికి గులాబీ తీర్థం పోసి కారెక్కించారు టీఆర్ఎస్ పెద్దలు. అయితే ఎన్నికలకు ముందు వంద స్థానాల్లో గెలుపు మాదే సీఎం కేసీఆర్ ప్రచారాన్ని హీటెక్కించారు. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలుపుకొని అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం వందకు చేరింది.
సీఎం రాకపాయే.. ఆర్టీసీ సమ్మెపై ఏం మాట్లాడకపాయే.. కేసీఆర్ సభకు వరుణిడి బ్రేక్..! మరి ఆనాడు..!!
అసెంబ్లీలో వంద బలం సరే.. ఈ ఒక్క ఎమ్మెల్యే సీటు ప్రతిష్టాత్మకమే..!
వంద బలం సరే.. ఇప్పుడు జరుగుతున్న హుజుర్నగర్ బై ఎలక్షన్స్లో కూడా ఆ స్థానం దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ పెద్దలు. ఈ ఒక్క స్థానం కూడా చేజారిపోకుండా అస్తశస్త్రాలు సిద్ధం చేశారు. కాంగ్రెస్ కంచుకోటైన హుజుర్నగర్లో హస్తానికి బీటలు వారేలా మందీ మార్బలాన్ని మోహరించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలో కీ రోల్ పోషిస్తున్న మరికొందరు బడా నేతలు అంతా కూడా హుజుర్నగర్ లోనే మకాం వేశారు. ఈ ఎన్నికలను సవాల్గా, ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ అభ్యర్థి విజయానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇక ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో.. రాత్రి, పగలు తేడా లేకుండా వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు.
కేసీఆర్ ప్రచారానికి వరుణుడు బ్రేక్.. ఇక కాంగ్రెస్లో మస్తు జోష్..!
ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ క్రమంలో గురువారం (17.10.2019) నాడు సీఎం కేసీఆర్ ప్రచార సభను హుజుర్నగర్లో ప్లాన్ చేశారు. మరోవైపు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటన శుక్ర,శనివారాల్లో జరగనుంది. అయితే ఆకస్మాత్తుగా గురువారం జరగాల్సిన కేసీఆర్ పర్యటన చివరి క్షణంలో రద్దయింది. వర్షం కారణంగా ఆయన టూర్ క్యాన్సిల్ అయిందనేది టీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాట. అదలావుంటే కేసీఆర్ సభ రద్దు కావడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిరాశ.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోందనే కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.
వారం రోజుల నుంచి కష్టపడి ఏర్పాట్లు.. చివరకు తుస్..!
కేసీఆర్ భారీ బహిరంగ సభకు దాదాపు వారం రోజుల నుంచి గులాబీ నేతలు చెమటోడ్చారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. వర్షం కారణంగా సభ ప్రాంగణం నీట మునగడం.. అటు ఏవియేషన్ అధికారులు కేసీఆర్ పర్యటన వద్దని సూచించడం.. ఇలాంటి కారణాలతో ఆయన పర్యటన కాస్తా రద్దయింది. ఈ క్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు అలర్టయ్యారు. అప్పటికప్పుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు.
ఆర్టీసీని నడపడం చేతకాదా.. నాకు అప్పగిస్తే లాభాలు చూపిస్తా : ప్రొఫెసర్ నాగేశ్వర్
హమ్మయ్య.. కేసీఆర్ రాలే.. ఓట్లన్నీ మనకే..!
కేసీఆర్ సభ రద్దు కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం. హుజుర్నగర్ కాంగ్రెస్ కంచుకోట అయినప్పటికీ.. కేసీఆర్ మాటల ధాటికి ఓటర్లు ఎక్కడ టర్న్ అవుతారోననే భయం వారిని వెంటాడినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయన సభ జరిగి నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించి ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి కాసింత మైనస్ అయ్యే ఛాన్సుండేదనేది కొందరి వాదన. మొత్తానికి కేసీఆర్ అటువైపుగా వెళ్లకపోవడం కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా ప్లస్ అనేది మరికొందరి వెర్షన్. అయితే చివరకు గెలుపు గుర్రం ఎవరు అనేది మాత్రం ఓటర్ల నాడి నిక్షిప్తమయ్యే ఈవీఎంలు తేల్చాల్సిందే.