తెలంగాణను ఏం చేస్తున్నారు కేసీఆర్.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్నలు..!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొందని సాకుగా చూపిస్తున్న కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ఆరోపించారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే మరోవైపు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఫైరయ్యారు.
బడ్జెట్ విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గాల్లో లెక్కలు వేసిందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఆర్థిక మాంద్యం ఎక్కువగా ఉందని.. దాని ప్రభావం తెలంగాణ మీద కూడా పడుతుందని చెబుతున్న కేసీఆర్ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మంత్రులకు విలువైన వెండి బహుమతులు ఇవ్వడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. ఆర్థిక క్రమశిక్షణలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
భారతదేశాన్ని మరింత పరిపుష్టిగా తయారు చేయడానికి, ఆర్థికంగా ఎదిగేలా మరింత అభివృద్ధి పరచడానికి.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు కిషన్ రెడ్డి. ఆర్థిక పరమైన విషయాల్లో చైనాను మించి ఎదిగేలా సెంట్రల్ గవర్నమెంట్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోందని చెప్పారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణమంటూ సీఎం కేసీఆర్ చెబుతున్న తీరు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అడ్డగోలుగా ఖర్చు పెడుతూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ విధానాలతోనే తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆరోపించారు.