మీ ఆడబిడ్డగా ఆశీర్వదించండి.. ప్రజాపక్షమే మా ఇజం : కోమటిరెడ్డి లక్ష్మి
నల్లగొండ : కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ కాంగ్రెస్. నల్గొండ కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. అంతలా జిల్లాలో వారి హవా నడుస్తోంది. ప్రజలకు దగ్గరగా ఉండటం.. ప్రజాప్రతినిధులుగా సేవలందించడం వారికి ప్లస్ పాయింట్. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్కు తోడు వారి కుటుంబం నుంచి రాజగోపాల్ రెడ్డి సతీమణి కూడా రాజకీయ అరంగేట్రం చేశారు.
స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రజాప్రతినిధులను కలుస్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు. అయితే స్థానిక సంస్థలను కొందరు కావాలని నిర్వీర్యం చేశారని.. తనను గెలిపిస్తే ప్రజాప్రతినిధుల హక్కులు కాపాడతానంటున్నారు. దానికోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా మారతానని చెబుతున్నారు. మీ ఆడబిడ్డగా ఆశీర్వదించడంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
జగన్ సీఎం కావాలని ఆకాంక్ష.. పదేళ్లుగా పాదరక్షలు లేకుండానే.. తెలంగాణలో వీరాభిమాని
కోమటిరెడ్డి కుటుంబమంటే ప్రజలే ప్రాణంగా బతికే ఫ్యామిలీ అని.. ఆ కుటుంబంలో నుంచి వస్తున్న తనను ఆదరించి గెలిపించాలని కోరారు. తమది సేవాభావం మెండుగా ఉన్న కుటుంబమని.. ప్రజాసేవ కోసం ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తెలిపారు. జనగామలో వృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ నెల 31న జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం ఎదురైనా, లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి భువనగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు.