కారు ఫుల్ అయింది .. లొల్లీ మొదలైంది ! టీఆర్ఎస్లో రోడ్డెక్కిన టికెట్ల పంచాయితీ.. సూసైడ్ అటెంప్ట్ !
సూర్యాపేట : జిల్లా టీఆర్ఎస్లో ముసలం రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల పర్వం పార్టీ పెద్దలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పరిషత్ ఎన్నికల కోసం టికెట్ల పంచాయితీ ముదురుతోంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. టీఆర్ఎస్ హవా కొనసాగుతుండటంతో ఈజీగా గెలవొచ్చనే అభిప్రాయంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కోసం టీఆర్ఎస్ లో ఆశావహులు పెరిగిపోతున్నారు.
ఈ నేపథ్యంలో టికెట్లు పొందడానికి కొందరు లాబీయింగ్ చేస్తుంటే.. మరికొందరేమో వేరే పంథా ఎంచుకుంటున్నారు. తమ అనుచరులను రెచ్చగొట్టి ఆత్మహత్య ప్రయత్నాలకు పురిగొల్పుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. దాంతో తమ నాయకుడికి అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే చనిపోతామంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు.
గులాబీ నేతలకు ఐటీ షాక్..! సీఎం కేసీఆర్ సహా ఎమ్మెల్యేలకు నోటీసులు?
మఠంపల్లి మండల టీఆర్ఎస్ జెడ్పీటీసీ టికెట్ కోసం పెద్దసంఖ్యలో ఆశావహులు పోటీపడుతున్నారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే భూక్యా రవి నాయక్, బానోత్ రమేష్ అనే ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు హుజూర్ నగర్ పార్టీ కార్యాలయంలో నానాయాగీ చేశారు. తమ లీడర్ కృష్ణా నాయక్కు మఠంపల్లి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకుంటే.. సూసైడ్ చేసుకుంటామంటూ ఒంటిమీద కిరోసిన్ పోసుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడున్నవారు వారిని అడ్డుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.