నల్గొండలో మరో సైకో శీనుగాడు.. మైనర్ బాలికపై రేప్.. శీలానికి రేటు..!
సూర్యాపేట : హాజీపూర్ సైకో శీనుగాడి ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అమ్మాయిలపై అతిదారుణంగా హత్యచారాలు చేసి జైలుపాలైన సీరియల్ కిల్లర్ వికృత చేష్టలు మరువకముందే.. నల్గొండ జిల్లాలో మరో మానవ మృగం జాడ వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలికను బెదిరించి, లొంగదీసుకుని గర్భవతిని చేశాడు నరరూప రాక్షసుడు.
తల్లికి విషయం తెలిసి ఆరా తీస్తే "ఐదు వేలిస్తా.. అబార్షన్" చేయించుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడట. ఇక న్యాయం చెప్పాల్సిన పెద్దమనుషులు శీలానికి వెల కడుతూ అంతో ఇంతో ఇప్పిస్తామని బేరసారాలకు దిగడం విస్మయం కలిగిస్తోంది.
మైనర్ బాలికపై అఘాయిత్యం
సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల బాలికపై.. పక్కింట్లో నివాసముండే యువకుడు కన్నేశాడు. ఆమె రాకపోకలను గమనిస్తూ అదను కోసం వేచిచూశాడు. ఆ క్రమంలో ఐదు నెలల కిందట వేరే వాళ్లింటికి వెళ్లి టీవి చూసి వస్తున్న బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో ఆ బాలిక మౌనం దాల్చింది. ఇక అప్పటినుంచి ఆ బాలికపై పైశాచికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక తల్లి ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో తండ్రితో కలిసి నివాసముంటోంది. అయితే 20 రోజుల కిందట తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఆ క్రమంలో బాలిక తల్లి గ్రామానికి చేరుకుంది. ఆమెకు సంరక్షణగా ఎవరూ లేకపోవడంతో అదే గ్రామంలో ఉంటోంది. ఇటీవల సదరు బాలిక అస్వస్థతకు గురికావడంతో డాక్టర్లకు చూపించింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో గర్భవతి అనే విషయం బయటపడింది.
చిట్ఫండ్ కంపెనీలు ప్రాణాలు తీస్తున్నాయి.. తస్మాత్ జాగ్రత్త..!
గర్భం వచ్చిందా.. ఐదు వేలిస్తా..!
కూతురు గర్భం దాల్చిందనే విషయం ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. అసలేం జరిగిందంటూ బాలికను నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. పక్కింటి యువకుడు తనపై చేసిన అఘాయిత్యాలను వివరించింది. ఐదు నెలలుగా తనపై లైంగికదాడి చేశాడని విలపించింది. విషయం కాస్తా బయటపడటంతో సదరు యువకుడిని బాలిక తల్లి నిలదీసింది.
బాలిక తల్లి ఆ యువకుడ్ని ప్రశ్నించడంతో అతడు ఏమాత్రం కంగారుపడలేదు. అవును, దానికి కారణం నేనే.. ఏం చేస్తారంటూ ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గర్భం వచ్చిందిగా.. ఐదు వేల రూపాయలిస్తా.. అది తీసేయించండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడట.
న్యాయం చేయాల్సిన పెద్దమనుషులు..?
మైనర్ బాలికపై అత్యాచారం చేయడమే గాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు పెద్దమనుషులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సదరు పెద్దమనుషులు కూడా ఆ మానవ మృగానికే వంతపాడుతున్నట్లు సమాచారం. ఆదివారం నాడు పంచాయితీ పెట్టిస్తే అక్కడ కూడా ఆ నరరూప రాక్షసుడు అలాగే మాట్లాడట. ఐదు వేలిస్తా.. అబార్షన్ చేయించాలంటూ బెదిరించాడట.
బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేయడమే గాకుండా దురుసుగా ప్రవర్తించాడు. అయినా పెద్దమనుషులు పల్లెత్తు మాట అనలేదని తెలుస్తోంది. పైగా అతడికే సపోర్ట్ చేస్తూ బాధితులకు అంతో ఇంతో ఇప్పిస్తామంటూ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారట. బాధను దిగమింగుకుని న్యాయం కోసం వచ్చిన బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. శీలానికి వెలకట్టే రీతిలో పెద్దమనుషులు ప్రవర్తించడం సభ్యసమాజానికే సిగ్గుచేటు.