ఆ పోస్టు కోసం ఎంత తెగింపు.. మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ..!
నల్గొండ : నచ్చిన పోస్టు కోసం ఓ ప్రధానోపాధ్యాయురాలు చక్రం తిప్పారు. ఇప్పటివరకు తాను ఆ పోస్టులో ఉండి ఇప్పుడు మారాల్సి రావడంతో కొత్త నాటకానికి తెర తీశారు. జిల్లా విద్యాధికారిని బురిడీ కొట్టించి ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ చేశారు. ఆ పోస్టులో తాను ఉండి తీరాల్సిందే అంటూ పట్టుబట్టి చివరకు మంత్రి సంతకం వాడేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైన ఈ ఘటనపై కేటీఆర్ పేషీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ మంత్రి సంతకం ఫోర్జరీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగంలో ప్రకంపనలు మొదలైనట్లు సమాచారం.
మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ..!
నల్గొండ జిల్లాలోని రావుల పెంట జడ్పీ గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మనావత్ మంగళ మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ చేసి అడ్డంగా బుక్కయ్యారు. జిల్లా ఓపెన్ స్కూల్స్ ఇన్ఛార్జ్ కో ఆర్డినేటర్గా కొనసాగిన ఆమె సాక్షాత్తూ మంత్రి సంతకం వాడుకోవడం చర్చానీయాంశంగా మారింది. కేవలం పోస్టు కాపాడుకునేందుకు చేసిన ఈ ప్రయత్నం జిల్లా అధికార యంత్రాంగాన్ని విస్మయానికి గురి చేస్తోంది.
అదే పోస్టులో కొనసాగేందుకు ఇంతలా తెగింపు..!
జిల్లా ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్గా కొనసాగిన మంగళను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని రెండు వారాల కిందట ఆ శాఖ కమిషనరేట్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు అందాయి. ఆమె స్థానంలో సూర్యాపేట జిల్లాకు చెందిన మరో ఉపాధ్యాయుడికి ఆ బాధ్యతలు కట్టబెట్టాలనేది ఆ ఉత్తర్వుల సారాంశం. అదలావుంటే మంగళను ఆ పదవి బాధ్యతల నుంచి తప్పించి సదరు ఉపాధ్యాయుడిని ఇన్ఛార్జ్గా నియమించాల్సి ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్ పదవిలో కొనసాగాలంటే ప్రధానోపాధ్యాయులు మాత్రమే అర్హులని.. టీచర్లకు ఆ ఛాన్స్ లేదని అతడిని ఆపినట్లు సమాచారం.
మంత్రి రికమండేషన్ లెటర్ పేరిట బురిడీ
ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్గా మొన్నటివరకు బాధ్యతలు నిర్వహించిన మంగళ ఆ పోస్టులో కొనసాగేందుకు మంత్రి రికమండేషన్ లెటర్ తెచ్చుకుంటానని డీఈవోతో విన్నవించుకున్నారట. ఆ నేపథ్యంలో సదరు డీఈవో కూడా ఓకే చెప్పి గడువు ఇచ్చారట. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మంగళ కొత్త స్కెచ్ వేశారు. ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ చేసి రికమండేషన్ లెటర్ సిద్ధం చేశారు. ఓపెన్ స్కూల్స్ సొసైటీ కమిషనర్కు సిఫార్సు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
డీఈవోను బోల్తా కొట్టించి.. మంత్రి పేషీ సీరియస్..!
మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ చేసి సృష్టించిన ఆ రికమండేషన్ లెటర్ డీఈవోకు అందించిన మంగళ యధేచ్ఛగా ఆ పోస్టులో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఓపెన్ స్కూల్స్ సొసైటీ కమిషనర్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకున్నా.. మంగళ ఇచ్చిన బోగస్ రికమండేషన్ లెటర్ను పరిగణనలోకి తీసుకుని డీఈవో ఆమెను కొనసాగించడం ఇక్కడ ట్విస్టుగా మారింది. ఈ బోగస్ రికమండేషన్ లెటర్ గురించి మంత్రి కేటీఆర్ పేషీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. మంత్రి సంతకం ఫోర్జరీ జరిగినట్లు ధృవీకరించిన పేషీ అధికారులు ఆ మేరకు ఓపెన్స్ స్కూల్స్ సొసైటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
పని వత్తిడి తక్కువ.. వేతనం ఎక్కువ.. అందుకేనా ఈ పోస్టు కోసం..!
జిల్లాలో ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 80 స్కూళ్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీటి ద్వారా విద్యా బోధన జరుగుతోంది. సెలవు దినాల్లో ఓపెన్ స్కూల్స్ విద్యా విధానంలో చదువుకునే స్టూడెంట్స్కు క్లాసులు నిర్వహిస్తారు. అయితే కో ఆర్డినేటర్ పోస్టులో కొనసాగితే అదనపు వేతనం లభిస్తుంది. అంతేగాకుండా పని వత్తిడి కూడా పెద్దగా ఉండదు. అందుకే ఈ పోస్టులో కొనసాగేందుకు మంగళ ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది.