అమ్మ ప్రేమ ముందు తలవంచిన విధి.. బ్రెయిన్ డెడ్ కొడుకు మళ్లీ బతికాడు..!
నల్గొండ : అమ్మ.. సృష్టికి మూలం. అమ్మ అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నమ్మకం.. అమ్మ ప్రేమ, వాత్సల్యం ముందు ఏదీ సరిరాదు, సరిపోదు. అలాంటి ఓ అమ్మ తన కుమారుడిని బతికించుకుంది. అలా ఇలా కాదు .. చనిపోయాడని వైద్యులు నిర్ధారించినా ... తన ప్రేమతో .. పిలుపుతో .. శోకంతో ఊపిరి పోసింది. పుట్టినప్పుడు తాను నొప్పులు పడి ప్రపంచంలోకి ఆహ్వానించిన అమ్మ .. మరోసారి తన పిలుపుతో మరోసారి జీవం పోసింది. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో జరిగింది ఘటన.
వాంతులు, విరోచనాలు
సూర్యాపేట జిల్లా పిల్లలమర్రికి చెందిన గందం సైదమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు డిగ్రీ పూర్తి చేయగా, రెండో కొడుకు కిరణ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే జూన్ 25న కిరణ్కు ఒంట్లో బాగోలేదు. వాంతులు, విరోచనలు చేశాయి. సీజన్ మార్పు వల్ల అని స్థానిక వైద్యుడిని సంప్రదించారు. అయినా ఫలితం లేదు. దీంతో సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా ఏ మార్పులేదు. దీంతో నార్కట్ పల్లి కామినేనికి తీసుకొచ్చినా ప్రభావం లేదు. దీంతో హైదరాబాద్లో ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే అతనికి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయ్యాడని .. వెంటిలేటర్ తీస్తే చనిపోతాడని వైద్యులు తెలిపారు. అయినా పేగుతెంచుకొని పుట్టిన బిడ్డను తీసుకొని ఇంటికొచ్చింది సైదమ్మ.
ఎక్కడో సందేహం
కానీ సైదమ్మకు ఏ మూల సందేహం. తన కుమారుడు చనిపోలేదని భావించింది. ఇంటికి తీసుకొచ్చాక .. స్థానికులు అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే సైదమ్మ శోకం ఆ యముడిని కూడా కరుణించింది. మెల్లగా కంట్లో నుంచి నీరుకారడం మొదలెట్టాడు. తర్వాత ఆమె మాట్లాడటంతో మెల్లిగా తలను అటు, ఇటు ఊపడం ప్రారంభించేశాడు. దీంతో స్థానిక వైద్యుడిని సంప్రదించే సరికి .. పల్స్ ఉందని చెప్పారు. దీంతో హైదరాబాద్లోని ఓ వైద్యుడి సూచనమేరకు అతనికి నాలుగురోజులు సపర్యలు చేసింది సైదమ్మ. దీంతో చచ్చిపోయాడునుకున్న కిరణ్ .. లేచి తిరగడం మొదలేట్టేశాడు. దీంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.
అద్భుతం
పిల్లలమర్రి గ్రామస్తులు కూడా సైదమ్మ ప్రేమ కిరణ్ను బతికించిందని చెప్తున్నారు. ఆమె ఏడవడం, చేయి పట్టుకొని ఉండటంతో కిరణ్ బతికాడని తెలిపారు. లేదంటే జీవించేవాడు కాదని చెప్తున్నారు. పల్స్ ఉన్నదని తెలిశాక .. కుమారుడికి తల్లి సపర్యలు చేసిందని పేర్కొన్నారు. రేయనగ, పగలనక తన కొడుకు బాగు కోసం పరితపించిందని గుర్తుచేశారు. మొత్తానికి ఓ తల్లి ఆర్తనాదాలకు జీవం లేని బిడ్డకు ఊపిరిపోసింది. ఈ ఘటన అద్భుతమని పిల్లలమర్రి గ్రామస్తులు చెప్తున్నారు.