కొడుకు బడికి పోకుంటే "డయల్ 100".. అసలేం జరిగిందంటే..!
నల్గొండ : ఎమర్జెన్సీ సమయాల్లో పోలీస్ హెల్ప్ లైన్ డయల్ 100 ఉపయోగపడుతోంది. ఎవరైనా ఆపదలో ఉండి 100 నెంబరుకు కాల్ చేస్తే పోలీసోళ్లు స్పందిస్తారు. బాధితులను రక్షించే ప్రయత్నం చేస్తారు. అయితే ఓ తల్లి తన కొడుకు గురించి ఫిర్యాదు చేసేందుకు డయల్ 100 నొక్కడం చర్చానీయాంశమైంది.
యాదగిరిగుట్టలోని అంగడి బజార్ ప్రాంతానికి చెందిన మంజుల భర్త కొన్నాళ్ల కిందట చనిపోయారు. దాంతో తాను పనిచేస్తూ పిల్లల్ని బాగా చదివించాలని ఆరాటపడుతున్నారు. భర్త లేకున్నా, ఉన్నదాంట్లో పిల్లలకు పెడుతూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని తాపత్రాయపడుతున్నారు. ఆ క్రమంలో తన పధ్నాలుగేళ్ల కొడుకు మాత్రం ఆమెను బాగా సతాయిస్తున్నాడు. చదువుకొమ్మంటే మొండికేస్తున్నాడు.
తోబుట్టువుకే ఎసరు.. అక్క ఆస్తిపై నజర్.. మల్కాజిగిరి కోర్టు మరో సంచలన తీర్పు..!
తన 14 ఏళ్ల కొడుకు లోకేశ్ను మేడ్చల్లోని గురుకుల సంక్షేమ హాస్టల్లో చేర్పించారు మంజుల. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న లోకేశ్.. ఐదు రోజుల కిందట హాస్టల్ నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. ఇక అప్పటినుంచి స్కూలుకు వెళ్లమంటే.. తాను చదువుకోనంటూ మారం చేశాడు. ఆ క్రమంలో ఆ బాలుడిని భయపెట్టాలనే ఉద్దేశంతో మంజుల పోలీస్ హెల్ప్లైన్ 100 నెంబరుకు డయల్ చేశారు.
అయితే ఆ కాల్ రిసీవ్ చేసుకున్న పోలీస్ అధికారులు వెంటనే స్పందించారు. వెంటనే కానిస్టేబుల్స్ను వారి ఇంటికి పంపించి ఠాణాకు పిలిపించారు. మంజుల చెప్పిన వివరాలతో బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాగా చదువుకోవాలని.. స్కూలుకు వెళ్లకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతావని మంచి, చెడు వివరించారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడివి కావాలని సూచించారు.