కోమటిరెడ్డి సోదరులే నన్ను ఓడించారు..! కాంగ్రెస్ కు భిక్షమయ్య గౌడ్ గుడ్ బై
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అనుకున్నదంతా అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలు టీడీపీ ఉనికి లేకుండా చేయాలన్నది టీఆర్ఎస్ వ్యూహం. ఆ మేరకు రాష్ట్రంలో సైకిల్ టైర్ పంక్చరయి.. కొత్త ట్యూబ్ దొరకని పరిస్థితి. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీపై నజర్ పెట్టింది గులాబీ దండు. హస్తం గూటి నుంచి ఒక్కొక్కరిని కారెక్కించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గులాబీ వనం వైపు చూస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరో దెబ్బ.. ఇంకో వికెట్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ రాజీనామా చేశారు. ఇప్పటికే పార్టీని వీడి వెళుతున్న వారితో సతమతమవుతున్న పార్టీ పెద్దలకు ఈ పరిణామం మరో దెబ్బ. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేసి పార్టీకి సేవలందించిన భిక్షమయ్య గౌడ్.. హస్తానికి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.
గతంలో ఆలేరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కొన్నాళ్ల నుంచి నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించిన భిక్షమయ్య గౌడ్ సడెన్ గా యూ టర్న్ తీసుకోవడం చర్చానీయాంశమైంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఆయనను నిలువరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో కేసీఆర్ ప్రమేయం..! లోక్పాల్లో ఫిర్యాదుకు కాంగ్రెస్ రెడీ
ఆ సోదరులే నన్ను ఓడించారు
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్న భిక్షమయ్య గౌడ్ కోమటిరెడ్డి సోదరులపై ఆరోపణలు గుప్పించారు. వారి కారణంగానే ఆలేరులో రెండు సార్లు ఓడిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తనపై కుట్ర చేశారని ధ్వజమెత్తారు. కొందరిని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దించి తన ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు.
భువనగిరి ఎంపీ టికెట్ను ఈసారి మధుయాష్కికి.. లేదంటే గ్రూపులు లేని ఇతర బీసీ నేతలకు ఇవ్వాలని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే కోమటిరెడ్డి సోదరులు అడ్డుపడి టికెట్ తెచ్చుకున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇటీవల కోమటిరెడ్డి సోదరులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. భువనగిరి ఎంపీ స్థానం ఎలాగైనా గెలవాలని వారు మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరగలేదనే కారణంతో పార్టీ, జిల్లా అధ్యక్ష పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ లో అన్యాయం.. అందుకే కారెక్కుతా..!
కాంగ్రెస్ లో బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం సహించలేక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు భిక్షమయ్య గౌడ్. నల్గొండ స్థానం ఓసీకి, భువనగిరి బీసీకి కేటాయించి టీఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించిందని కొనియాడారు.
సీఎం కేసీఆర్ పాలన నచ్చిందని.. తన అనుచరులతో కలిసి త్వరలో గులాబీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్, కేటీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బేషుగ్గా ఉన్నాయన్నారు. అందుకే రెండు మూడు రోజుల్లో కారెక్కేందుకు సిద్ధమయ్యానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు చాలా అవకాశాలు ఇచ్చిందని.. ఇన్నాళ్ల పాటు తనకు సహకరించిన పార్టీశ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.