ఎకరాలకొద్దీ అక్రమ పట్టాలు.. రెవెన్యూ అధికారుల లీలలు.. ఏసీబీ నిఘాతో పరార్..!
నల్గొండ : రెవెన్యూ అధికారుల లీలలు మరోసారి బయటపడ్డాయి. ఎకరాలకొద్దీ అక్రమ పట్టాలు చేసిన అవినీతి అధికారుల బాగోతం వెలుగు చూసింది. చందంపేట ఎమ్మార్వో ఆఫీస్ కేంద్రంగా సాగిన అక్రమాల పుట్ట డొంక కదిలింది. ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టడంతో సదరు అధికారులు పరారీ కావడం చర్చానీయాంశమైంది. అదలావుంటే నకిలీ పాస్ పుస్తకాల విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. అదే క్రమంలో ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పూర్తి నివేదికలు అందించడం గమనార్హం.
అక్రమ పట్టాల గుట్టు రట్టు.. రెవెన్యూ అధికారుల లీలలు
నల్గొండ జిల్లాలోని చందంపేట ఎమ్మార్వో కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమ పట్టాల గుట్టు రట్టైంది. ఆ బాగోతంలో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారుల తీరుపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఎకరాలకొద్దీ అక్రమ పట్టాలు చేసి లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డ అక్రమార్కుల డొంక కదలడంతో సదరు ఎమ్మార్వో ఆఫీస్పై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏసీబీ. రైతు బంధు, రైతు బీమా కింద ప్రభుత్వం నుంచి డబ్బులు పొందొచ్చని అడ్డగోలుగా అక్రమ పట్టాలు చేసిన సదరు అధికారులు పత్తా లేకుండా పోయారు. మాయ మాటలు చెబుతూ అందినకాడికి దండుకుని ఏకంగా 11 వేల ఎకరాలకు అక్రమ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది.
టీఆర్ఎస్ జోరుపై బీజేపీ కన్ను.. కోల్బెల్ట్ ఏరియాలో కిషన్ రెడ్డి పర్యటన అందుకేనా?
చందంపేట ఎమ్మార్వో కార్యాలయం కేంద్రంగా..!
చందంపేట ఎమ్మార్వో కార్యాలయంలో 2018-19 సంవత్సర కాలంలో తహసీల్దార్గా పనిచేసిన చాంద్ పాషాతో పాటు పలువురు ఉద్యోగులు ఈ అక్రమ దందాలో పాలు పంచుకున్నట్లు తేలింది. ఇన్ఛార్జ్ ఎమ్మార్వో రవీందర్తో పాటు వీఆర్వో లుగా పనిచేసిన అంజయ్య, నాగలక్ష్మి, యాదయ్య.. జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్.. ఇంకా సబ్ స్టాఫ్ శంకర్, శ్రీనివాస్, యూసుఫ్ తదితరులపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
11 వేల ఎకరాలకు అక్రమ పట్టాలు..!
చందంపేట ఎమ్మార్వో కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమ పట్టాల వ్యవహారం గుట్టు రట్టు కావడంతో కొంతమంది రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు తేలింది. వారితో చేతులు కలిపిన రెవెన్యూ అధికారులు 11 వేల ఎకరాలకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. భూములు లేనప్పటికీ పాసు పుస్తకాలు మంజూరు చేయడం దుమారం రేపింది. ఇదే విషయం విచారణలో తేలడంతో సదరు రెవెన్యూ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు క్రిమినల్ కేసులు కూడా ఫైల్ కావడం గమనార్హం. అదలావుంటే కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు చందంపేట ఎమ్మార్వో కార్యాలయంలో రికార్డులు పరిశీలించి నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది.
పోలీస్ అధికారి అర్ధనగ్న ప్రదర్శన.. విజయవాడలో అలజడి..!
ఏసీబీ అధికారులకు రెవెన్యూ శాఖ సమగ్ర నివేదిక..!
అక్రమాలతో రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగుల లీలలు బయటపడటంతో స్థానికంగా చర్చానీయాంశమైంది. పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అక్రమ పట్టాలుగా గుర్తించిన వాటిని ఆన్లైన్ నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు సమగ్ర నివేదికను రెవెన్యూ అధికారులు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఏసీబీ అధికారులు నిఘా పెట్టారని తెలియడంతో సస్పెండైన రెవెన్యూ సిబ్బంది పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.