సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించండి.. టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న సైకో శీను బాధితులు
నల్గొండ : హాజీపూర్ సైకో శీనుగాడి వరుస హత్యల నేపథ్యంలో బొమ్మల రామారంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సీరియల్ కిల్లర్ను ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో ఉద్రిక పరిస్థితులు తలెత్తాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి శిక్ష వేయాలంటూ నినాదాలు చేశారు. ఆ క్రమంలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన టీఆర్ఎస్ లీడర్లకు చేదు అనుభవం ఎదురైంది.
మంత్రుల హామీ ఏమైంది..!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరుస హత్యల ఎపిసోడ్లో హాజీపూర్ గ్రామస్తులు తగ్గడం లేదు. ఇదివరకే నిందితుడి ఇంటిని తగులబెట్టారు. సైకో శీనుగాడు కనిపిస్తే చంపేయాలనే కసి వారి కళ్లల్లో కనిపిస్తోంది. అలాంటి నేపథ్యంలో మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్ను కలిసి సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఆ మేరకు మంత్రులు హామీ ఇచ్చినా.. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చెడు వ్యసనాలకు బలి.. దొంగల్లా మారిన టెన్నిస్ కోచ్, క్రికెటర్
ఎర్రటి ఎండలో నిరసన..!
హాజీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు అమ్మాయిలపై అతి కిరాతకంగా హత్యాచారం చేయడంతో.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పట్టుబడుతున్నారు. ఆ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు బొమ్మల రామారం చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గ్రామస్తులందరూ వారికి అండగా నిలబడ్డారు. ఉదయం నుంచి జరుగుతున్న ఆందోళన సాయంత్రానికి కూడా చల్లబడలేదు. ఎర్రటి ఎండలో తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు.
టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న గ్రామస్తులు
ఆ క్రమంలో వారికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన టీఆర్ఎస్ నేతలను గ్రామస్తులు అడ్డుకున్నారు. మూడు వారాల నుంచి తాము బాధ పడుతుంటే మీకు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యమంటూ వారేదో సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అందుకే ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ గ్రామస్తులు వినిపించుకోలేదు. మీ సంఘీభావం మాకు అక్కర్లేదంటూ.. సీఎం కేసీఆర్తో సమావేశం ఏర్పాటు చేయించాలంటూ డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
గ్రామస్తులంతా కలిసికట్టుగా..!
ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను సైకో శీనుగాడు హత్యాచారం చేయడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. హత్యాచారాల తర్వాత గ్రామంలోనే కలియతిరుగుతూ ఏమీ తెలియనట్లు నటించిన నిందితుడి పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల రాచకొండ పోలీసులు నిందితుడిని కస్టడీకి తీసుకున్న తర్వాత సంఘటనాస్థలికి వెళ్లినప్పుడు గ్రామస్తులు ఎక్కడ దాడి చేస్తారోననే భయంతో రాత్రి పూట ఆ తంతు ముగించారు. మొత్తానికి సైకో శీనుగాడికి కఠిన శిక్ష పడేదాకా గ్రామస్తులు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.