నయీం బినామీ ఆస్తుల అమ్మకం..! రెచ్చిపోతున్న అనుచరులు..! పోలీసాధికారులపై వేటు
నల్గొండ : కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయన అనుచరులు సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల నయీం బినామీ ఆస్తుల అమ్మకం తెరపైకి రావడంతో అనుచరులు మళ్లీ రెచ్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ పోలీసుల అండతో నయీం నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడో.. అదే పోలీసుల సాయంతో ఆయన అనుచరులు ఇప్పుడు బినామీ ఆస్తుల అమ్మకానికి తెరలేపుతున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసాధికారులపై చర్యలు తీసుకోవడం చర్చానీయాంశంగా మారింది.
బస్తీ, గల్లీ 'బచ్చే గ్యాంగ్' లపై పోలీస్ నజర్.. మత్తులో రెచ్చిపోతున్న యువతకు చెక్
బినామీ ఆస్తులు
2016 ఆగస్టు 6న పోలీసుల ఎన్కౌంటర్లో నయీం హతమయ్యాడు. అయితే నయీం బెదిరింపులతో, కబ్జాలతో ఆక్రమించుకున్న ఆస్తులపై దర్యాప్తు చేసేందుకు సిట్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. విచారణ అధికారిగా ఐజీ నాగిరెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆ క్రమంలో నయీం బాధితుల ఫిర్యాదుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 198 కేసులు నమోదయ్యాయి. బెదిరింపులకు పాల్పడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్ల రూపాయల మేర ప్రజల ఆస్తులు కబ్జా చేసినట్లు నిర్ధారించారు.
నయీం కుటుంబీకులతో పాటు ఆయన అనుచరులపై పలు కేసులు బుక్ చేసిన పోలీసులు.. పదుల సంఖ్యలో కార్లు, బైకులు, నివాసగృహాలతో పాటు వెయ్యి ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి, 1.67 లక్షల చదరపు గజాల ప్లాట్లు ఉన్నట్లు తేల్చారు అధికారులు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం దాదాపు 1200 కోట్ల రూపాయల మేర ఉన్న ఈ బినామీ ఆస్తులను సీజ్ చేశారు.
బినామీ ఆస్తుల అమ్మకం.!
అప్పట్లో నయీం తమను బెదిరించి లాక్కున్న భూములను తిరిగి అప్పగించాలని బాధితులందరూ ఏకమయ్యారు. అధికారుల చుట్టూ తిరుగుతూ తమ పేరిట చేయాలని కోరుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆందోళనలకు కూడా దిగారు. అదలావుంటే నయీం బినామీ ఆస్తులను గుట్టు చప్పుడు కాకుండా అమ్మేందుకు ఆయన అనుచరులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
బొమ్మాయిపల్లి టీచర్స్ కాలనీ సమీపంలోని 154 ఎకరాల భూమిని అప్పట్లో నయీం నేతృత్వంలో అతడి అనుచరులు కబ్జా పెట్టారు. దీన్ని సిట్ పోలీసులు బినామీ ఆస్తిగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అందులో నుంచి 5.20 ఎకరాలను బెంగళూరుకు చెందిన ఓ డెవలపర్స్ సంస్థ పేరు మీద 3 రోజుల కిందట భువనగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసాధికారులపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. డీసీపీ రామచంద్రారెడ్డిని యూసుఫ్ గూడలోని ఫస్ట్ బెటాలియన్ ఎస్పీకి రిపోర్టు చేయమని ఆదేశాలిచ్చారు. అలాగే భువనగిరి టౌన్ ఇన్ స్పెక్టర్ వెంకన్నను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మళ్లీ మొదటికి..!
నయీం
ఎన్కౌంటర్
తర్వాత
కేసులు,
బినామీ
ఆస్తులు
అటాచ్
తదితర
కారణాలతో
ఆయన
అనుచరులు
డీలా
పడ్డారు.
ఆర్థికంగా
చితికిపోవడంతో
చేతిలో
డబ్బులు
లేక
ఇబ్బందులు
పడుతున్నారు.
దీంతో
మళ్లీ
తెరంగేట్రం
చేసినట్లు
తెలుస్తోంది.
డబ్బుల
కోసం
బెదిరింపులకు,
సెటిల్మెంట్లకు
పాల్పడుతున్నట్లు
తెలుస్తోంది.
రియల్
ఎస్టేట్
వ్యాపారులను
బెదిరించినట్లు
సమాచారం.
నయీం బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారనే ఆరోపణలున్నాయి. యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో ఇప్పటికే పలు భూములను అమ్మేసినట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తులకు కాకుండా ఇతర ప్రాంతాల వ్యక్తులకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యక్తులైతే సమాచారం బయటకు పొక్కుతుందనే కారణంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో.
అప్పటివరకు బినామీ ఆస్తులుంటాయా?
ఇతర ప్రాంతాలకు చెందినవారికి తక్కువ ధర ఆశ జూపుతూ భూములు అమ్మేస్తున్నట్లు సమాచారం. నయీం బినామీ భూములని తెలియక కొందరు కొంటుంటే.. నయీం పేరు మీద కానీ, ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు రావని తలచి మరికొందరు ముందుకొస్తున్నారట. మొత్తానికి నయీం బినామీ ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతుండగానే.. లోలోపల అతడి అనుచరులు అమ్మకాలకు సిద్ధపడుతుండటం గమనార్హం. దర్యాప్తు పూర్తయ్యేసరికి ఆ బినామీ ఆస్తులన్నీ అమ్ముడుపోయేలా ఉన్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి.