నోముల అంత్యక్రియలు పూర్తి.. హాజరైన సీఎం కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ముగిసాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అంతకుముందు నోముల నర్సింహయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. నోముల కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారికి గుండె ధైర్యం కల్పించారు. వారి కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.
మంగళవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే. హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. నోముల మృతితో కుటుంబసభ్యులు/ బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. పార్టీ కార్యకర్తలు విషాద వదనంలో మునిగిపోయారు.
నోముల అంత్యక్రియలు పాలెం గ్రామంలోని వ్యవసాయక్షేత్రంలో నిర్వహించారు. మంగళవారం ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్ లో పాలెం గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. దాదాపు గంట పాటు అక్కడ ఆయన ఉన్నారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆయన హైదరాబాద్ బయల్దేరారు. నోముల మృతితో ఉమ్మడి నల్గొండ టీఆర్ఎస్ క్యాడర్ విషాదంలో మునిగిపోయింది. ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతలు కూడా బాధాతప్త హృదయంతో నిండిపోయారు.