హుజుర్నగర్లో బామ్మ పోటీ.. ఎమ్మెల్యే ఎన్నికలకు సై.. ఎందుకో తెలుసా?
సూర్యాపేట : హుజుర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అని ప్రధానంగా పోటీ పడుతున్న తరుణంలో బీజేపీ, టీడీపీ, సీపీఎం పార్టీల నుంచి కూడా అభ్యర్థులు బరిలోకి దిగారు. సోమవారం (30.09.2019) నాటికి గడువు ముగియడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు క్యూ కట్టారు. దాదాపు 80 మంది వరకు నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం కనిపిస్తోంది. అయితే స్క్రూటినీ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనేది తేలనుంది.
హుజుర్నగర్ ఉప ఎన్నిక కోసం ఓ బామ్మ పోటీ పడుతుండటం చర్చానీయాంశమైంది. తన భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు పట్టా ఇవ్వకపోవడంతో 85 సంవత్సరాల వృద్ధురాలు ఈ రకంగా నిరసన తెలియజేస్తున్నారు. అదే క్రమంలో హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రజారోగ్యంపై తెలంగాణ సర్కార్ నజర్.. పేదలకు 58 రకాల ఆరోగ్య పరీక్షలు ఫ్రీ
స్థానికురాలైన లక్ష్మి నర్సమ్మ కొంతకాలంగా తన భూమికి సంబంధించి పట్టా ఇవ్వాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వృద్ధురాలని కూడా చూడకుండా సంబంధిత అధికారులు ఆమెను ముప్పు తిప్పలు పెడుతున్నారట. ఈ నేపథ్యంలో హుజుర్నగర్ ఉప ఎన్నిక రావడంతో తాను సైతం అంటూ బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేశారు. అదలావుంటే మట్టపల్లి మండలం గుర్రంపోడు గిరిజనులు కూడా తమ భూములకు పట్టాలు చేయడం లేదని ఆరోపిస్తూ వారు కూడా నామినేషన్లు వేశారు.
కొంతమంది కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా నామినేషన్లు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో దాదాపు వంద మందికి పైగా రైతులు నామినేషన్లు వేయడంతో టీఆర్ఎస్ విజయావకాశాలు దెబ్బ తిన్నాయి. ఆ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అదే తరహాలో హుజుర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడంతో ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందా అనే ఊహాగానాలు అప్పుడే జోరందుకున్నాయి.