కోమటిరెడ్డితో మిలాఖత్పై నోరు విప్పిన పైళ్ల.. ఒకసారి కలిశాం.. కానీ..!
భువనగిరి : లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో టీఆర్ఎస్కు గట్టిదెబ్బ తగిలింది. 16 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామంటూ పార్టీ అగ్రనేతలు ఉదరగొట్టినా.. ఫలితాలు వచ్చేసరికి సీన్ రివర్సయింది. కేవలం 9 స్థానాలకే టీఆర్ఎస్ విజయం పరిమితమైంది. అయితే టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఓడిపోవడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం వారికి తలనొప్పి వ్యవహారమైంది.
లోక్సభ ఎన్నికల్లో భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఓడిపోవడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మిలాఖత్ అయ్యారనే వార్తలు గులాబీవనంలో భగ్గుమంటున్నాయి. అయితే కోమటిరెడ్డితో తాను కలిసి మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న అంశంపై ఎట్టకేలకు నోరు విప్పారు పైళ్ల. అదంతా కూడా తనపై దుష్ర్పచారం చేయడంలో భాగమేనంటూ కొట్టిపారేస్తున్నారు.
బూర ఓటమికి నేను కారణం కాదు.. పైళ్ల వివరణ
భువనగిరిలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఓటమికి తనను కారణంగా చూపుతూ కుట్ర జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. ఆయన ఓడిపోవడం తనకు కూడా చాలా బాధ కలిగించిందని.. అది కలలో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చారు. బూర ఓటమికి తాను కారణమంటూ వస్తున్న వార్తలపై మీడియా సమావేశంలో ఆయన వెర్షన్ చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ ఓడిపోవడంపై సమీక్షించుకోవాల్సిన అవసరముందన్న పైళ్ల.. ఆయన ఓటమికి రోడ్డు రోలర్ గుర్తే ప్రధాన కారణమన్నారు. కారు, రోడ్డు రోలర్ క్రాస్ ఓటింగ్తోనే బూర ఓడిపోయారని.. ఎవరూ కావాలని ఆయనను ఓడించే ప్రయత్నం చేయలేదన్నారు.
సీఎం కూతురును, కుడిభుజాన్ని ఓడించాం.. కాంగ్రెస్కు చావు తప్పి కన్ను లొట్ట : బీజేపీ
కోమటిరెడ్డితో కలిసింది క్షణమే.. అంతలో ఎంత మాట్లాడుతా?
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో తాను కలిసి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అలా ఎందుకు అసత్య ప్రచారం జరుగుతుందో అంతుచిక్కడం లేదన్నారు. ఆ విషయంలో తాను చాలా బాధపడుతున్నట్లు తెలిపారు.
ఒకానొక సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ హోటల్ దగ్గరకు వచ్చారని.. అక్కడే ఉన్న తనను కాకతాళీయంగా కలిశారని చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో చాలామంది అక్కడ ఉన్నారని.. తామిద్దరం కలిసింది రహస్యమేమీ కాదన్నారు. తాము కలిసింది కేవలం ఒక్క నిమిషం మాత్రమేనని తెలిపారు.
కోమటిరెడ్డితో మాట్లాడిందేమీ లేదు.. నాపై అనవసర దుష్ప్రచారం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తన మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని కుండబద్దలు కొట్టారు పైళ్ల శేఖర్ రెడ్డి. బొమ్మల రామారం మండలంలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్న ఆడియోను ఎంపీ పీఎ, ఎమ్మెల్యే సంభాషణగా మార్చి దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఇలా చేయడం సమంజసం కాదని.. ఇలాంటి చర్యలకు పాల్పడినవారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు.
భువనగిరి ఎంపీగా బూర నర్సయ్య గౌడ్ను గెలిపించుకోవడానికి పార్టీ నేతలుగా, కార్యకర్తలుగా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని గుర్తుచేశారు పైళ్ల. అందులో తాను కూడా సైనికుడిలా పనిచేశానని చెప్పుకొచ్చారు. అయితే కులాల మధ్య చిచ్చు పెట్టే క్రమంలో కొందరు ఇలాంటి పనికిమాలిన కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనమీదే ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని వాపోయారు. ఏదిఏమైనా భవిష్యత్తులో భువనగిరిలో వందశాతం గులాబీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.